YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సర్వేలతో అభ్యర్ధులు

సర్వేలతో అభ్యర్ధులు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల సమయం సమీపిస్తోంది. అభ్యర్థుల ఎంపికకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చురుగ్గా కసరత్తు చేస్తున్నాయి. అయితే గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఫోన్ సర్వేలపైనే అభ్యర్థుల ఎంపికకు ప్రధాన కొలమానంగా ప్రధాన పార్టీలు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ అధికార టీడీపీ మాత్రమే ఈ తరహా ప్రయోగంతో కూడిన సర్వేలు చేస్తూ వచ్చేంది. అందులోనూ పార్టీ కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పనితీరుపై సర్వే జరుపుతూ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పథకంలో మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టింది. అదే తరహాలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అనుకుంటున్న ఇద్దరు ముగ్గురు ఆశావహుల పేర్లతో ప్రజలకు ఫోన్‌కాల్ చేసి సర్వే చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?, ఫలానా అభ్యర్థి అయితే గెలుపోటములు ఎలా ఉంటాయి? పార్టీ పనితీరు ఎలా ఉంది? తదితర అంశాలతో కూడిన ప్రశ్నలు సంధించి ప్రజల అభిప్రాయాలను వారి మాటల ద్వారా తెలుసుకోకుండా అంకెలు నొక్కడం ద్వారా తెలియచేయమంటూ ముగిస్తున్నారు. అధికార పార్టీ నుండి మాత్రమే ఇప్పటిదాకా ఈ తరహా ఫోన్‌కాల్స్ వస్తుండగా, గత కొద్ది రోజుల నుండి ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి నిత్యం ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటర్లకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. దీంతో ఓటర్ల మనోగతం తెలియక తమ పేరుపై వారి స్పందన ఏమిటనే చిక్కుప్రశ్నతో టిక్కెట్ ఆశావహులు సతమతమవుతుండడం విశేషం. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనను ఈ సర్వేలు ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ టిక్కెట్ ఇవ్వాలని భావించిన నేతకు పార్టీ చేపట్టిన ఫోన్ సర్వేలో పూర్తిస్థాయి ప్రతికూల ఫలితాలు ఉంటే కచ్చితంగా సదరు నేతను పక్కనబెట్టి వేరే వారికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ ఫోన్‌కాల్స్ సర్వేలపై నేతలు కూడా తమ అనుచరగణానికి, కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. సర్వేలో అడిగే ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పాలనే అంశంపై కూడా వారికి వివరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నుండి వచ్చే ఫోన్‌కాల్ సర్వేలకు సంబంధించి కూడా స్పందించే విధానంపై తర్ఫీదునిస్తుండడం గమనార్హం. ప్రత్యర్థి పార్టీకి చెందిన బలహీన నేత పేరును ప్రతిపాదించేలా నెంబర్లు నొక్కమంటూ తమ కార్యకర్తలకు సూచనలిస్తుండడం విశేషం. దీనివల్ల సదరు అభ్యర్థి తమకు ప్రత్యర్థిగా ఎన్నికల్లో ఎదురైతే తమ గెలుపు సులువనే భావనలో వారుంటున్నారు. ఇదే కోవలో పోటీపై ఆసక్తితో ఉన్న పలువురు ఆశావహులు కూడా తమ సొంత సర్వే జరిపించుకుంటుండడం గమనార్హం. జిల్లాలోని మెట్ట ప్రాంతం నుండి అధికార పార్టీ తరపున పోటీ చేయాలనే ఆలోచనతో తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఓ నేత తన గెలుపుపై తానే సొంతంగా ఒక సంస్థ ద్వారా సర్వే చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఇలా ప్రతిఒక్కరూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు సెల్ ఫోన్ల ద్వారా తమ రాజకీయ భవిష్యవాణి వినేందుకు ఉవ్విళ్లూరుతుండడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts