
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొద్దికాలంగా తీవ్ర ఉత్కంఠను సృష్టిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సస్పెన్స్ ఎపిసోడ్కు తెరదించాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా మిగతా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నది గులాబీ నేతలను కలవరపెడుతున్న ఎపిసోడ్కు తెరదించుతూ రాబోయే మాఘమాసంలో మంచి రోజు చూసుకుని కేబినెట్ పదవుల పందేరం చేయబోతున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గులాబీ దళపతి చేస్తున్న కసరత్తు ప్రకారం, గతంలో పనిచేసిన మంత్రులందరికీ మళ్లి క్యాబినెట్ బెర్తులు దక్కే అవకాశం లేదు. పాత, కొత్తల మిశ్రమంగా క్యాబినెట్ కూర్పు ఉంటుందని సీఎం స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం క్యాబినెట్లో ఆరు నుండి ఎనిమిది మంది కొత్తవారు ఉండే అవకాశం ఉందని, తొలివిడత క్యాబినెట్ విస్తరణలోనూ ఇద్దరు లేదా ముగ్గురు కొత్తవారు ఉండవచచ్చన్న అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. మంత్రివర్గంలోకి ఆరు నుండి ఎనిమిది మందిని తీసుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. . ఇక కేంద్రప్రభుత్వం కూడా తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుందని భావించగా, ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా విస్తరణ నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఈనెల 30న మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ముగియనుండగా, ఆ తర్వాత విస్తరణ తేదీని సీఎం ఖరారుచేసే అవకాశముందన్న ప్రచారం తాజాగా వినబడుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్నేత, మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్గా నియమించడంతో ఆ జిల్లానుండి వేముల ప్రశాంత్రెడ్డికి దాదాపు లైన్క్లియర్ అయినట్లేనన్న చర్చ సాగుతోంది. కరీంనగర్ నుండి కొప్పుల ఈశ్వర్ పేరు ఈసారి బలంగా వినిపిస్తోంది. ఇక వరంగల్ నుండి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కలను ఈసారి కేసీఆర్ నెరవేర్చడం ఖాయమేనన్న చర్చ సాగుతోంది. చీఫ్విప్లు, విప్లను కూడా సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. ఈసారి పదవులకు నేతల ఎంపికలో కొన్ని అనూహ్య నిర్ణయాలు, కేసీఆర్ మార్కు సంచలనాలు కూడా ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు, మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఇద్దరికీ తొలివిడత క్యాబినెట్లో చోటు లభిస్తుందా.. లేదా అన్న ఆసక్తి నెలకొంది.