
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిజామాబాద్ లో తనను ఓడించేందుకు జాతీయపార్టీలైన భాజపా, కాంగ్రెస్ కలిసిపోయాయని నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత ఆరోపించారు.. పసుపు బోర్డు ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రధాని నరేంద్రమోదీ ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామంటే ఏ రకంగా నమ్మాలని కవిత ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం ఐదేళ్లలో ఏ సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు.జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాన్ని అభివృద్ధి ఎవరు చేశారో ఆలోచించి ఓటు వేయాలని, భాజపా మాటలు నమ్మి యువత బలికావద్దన్నారు. జగిత్యాల : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పసుపు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పసుపు బోర్డు సాధన కోసం ఎంపీగా నా ప్రయత్నాన్ని ప్రారంభించి.. అధికారికంగా, రాజకీయంగా చిత్తశుద్ధితో ఒత్తిడి తెచ్చాను. కానీ కేంద్రం స్పందించలేదు అని గత ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా చెప్పాడు. పసుపు రైతుల బాధలు తెలుసన్న మోదీ.. ఆ తర్వాత వారిని పట్టించుకోలేదు. ఈ విషయంలో నరేంద్ర మోదీ మాట తప్పారు. ఈసారి పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో పెడుతామని చెప్పి.. పెట్టలేదు. కేంద్రం మోసపూరిత మాటలు మాట్లాడి ప్రజలను మభ్య పెడుతుంది అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గ్రామాల్లోకి వస్తాయి. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నష్టం చేసింది. ప్రజల నోట్లో మట్టి కొట్టింది. ప్రజలకు మేలు జరగాలని కాంగ్రెస్ ఏ పని చేయలేదు. తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసినా, సీఎం కేసీఆర్ డిమాండ్ చేసినా భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగు కావాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఇది కావాలంటే కాళేశ్వరం పూర్తి కావాలి. దీనికి జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం పెడచెవిన పెట్టింది. ఏపీలో నిర్మిస్తోన్న పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి 90 శాతం నిధులు ఇచ్చింది. మన రైతులపై కేంద్రానికి ప్రేమ లేదు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేదు. వ్యవసాయాన్ని నరేగాకు అనుసంధానించాలని కోరినా బీజేపీ పట్టించుకోలేదు. 2014 జూన్ 2 న తెలంగాణ ఏర్పాటైతే.. కనీసం రాష్ట్రపతి ప్రసంగంలో శుభాకాంక్షలు చెప్పలేదు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏడు మండలాలను ఏపీలో కలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినా వాటిని కేంద్రం నెరవేర్చడం లేదు. ఇటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామా, నిరంతరం మన హక్కుల కోసం ఢిల్లీలో నిలబడి, పోరాడి, కొట్లాడి సాధించుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి.జగిత్యాలను కరీంనగర్కు ధీటుగా తయారు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటను బాధ్యతగా నెరవేర్చేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పారిపోయిండు. కాంగ్రెస్, బీజేపీ కలిసి టీఆర్ఎస్ను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం, విశ్వాసం.. నిజామాబాద్ ప్రజల మీదనే. మరి మీరే రెండు జాతీయ పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తాయి. దేశం కోసం ధర్మం కోసం మోదీకి ఓటేయాలని హోర్డింగ్ పెట్టారు. కానీ ఆయన దేశానికి చేసిందేమీ లేదు. మతాలు, కులాల మధ్య బీజేపీ గొడవలు సృష్టిస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బోర్డర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ ఐదేళ్ల కాలంలో సైనికులు, పౌరులు మృతి చెందారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మోదీ చేసిందేమీ లేదు అని ఎంపీ కవిత తెలిపారు.