
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు వివిధ పార్టీల్లో కొనసాగిన నేతలు ఆ ఎన్నికల తరువాత గులాబీ దళంలోకి చేరిపోయారు. కాంగ్రెస్ తో పాటు దాదాపు అన్ని పార్టీల నుంచి టీఆర్ ఎస్ కండువా కప్పుకొన్నారు. దీంతో ఇప్పుడు గులాబీ పార్టీలో నేతల సందడి నెలకొంది.ఇటీవల జడ్పీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాజధానికి వస్తే గాంధీభవన్ కో ఎన్టీఆర్ భవన్ కో వెళ్లే వారు ఇప్పుడు నేరుగా ప్రగతిభవన్ కు రావడం అసక్తిగా మారింది. టీఆర్ ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ టీడీపీ నుంచి చాలా మంది నేతలు చేరారు. అటు సీపీఐ నుంచి కూడా వలస వచ్చారు. ఇక్కడ పార్టీలో ముందునుంచి కొనసాగుతున్నవారూ ఉన్నారు. ఈ దశలో వీరంతా ఒక్కటిగా కాకుండా ఎవరికి వారే గ్రూపులుగా ఉన్నట్లు కనిపించింది. సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ అప్పటి టీడీపీలో కొనసాగిన నేతలు కలుసుకొన్నారు. వీరంతా ఒక్కచోట చేరి సందడి చేయడం ఆసక్తిగా మారింది. అటు సబితా ఇంద్రారెడ్డితో పాటు సునీతా లక్ష్మారెడ్డిలు టీఆర్ ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారంతా మరో గ్రూపులో కలిసి ఉన్నట్లు కనిపించింది. ఒకప్పటి కాంగ్రెస్ నాయకులు అప్పటి టీడీపీ నాయకులకు దూరంగా ఉండడంపై రకరకాలుగా చర్చించుకున్నారు.ఇలా ఇతర పార్టీల నుంచి గులాబీ తోటలోకి వచ్చినా అందరు ఒక్కటిగా కలిసి పోకుండా ఎవరికి వారే గ్రూపులుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. జడ్పీ ఎన్నికల్లో ఎలాంటి పోకడలకు పోకుండా అందరినీ కలుపుకోవాలని కేసీఆర్ ఓ వైపు హెచ్చరిస్తున్నా ఇలా గ్రూపులుగా విడిపోవడం కొందరిని ఆలోచింపజేసింది. ప్రస్తుతం టీఆర్ ఎస్ కు ఎదురులేని పార్టీ రాష్ట్రంలో దాదాపు లేనట్లే వాతావరణం తలపిస్తోంది. ఈ సమయంలో టీఆర్ ఎస్ లో ఇలాంటి సహజమే అనిపించినా ఈ విషయం పెద్దదిగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రతిపక్షాలు గుసలాడుకుంటున్నారు.