
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతురాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. భారతదేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 60 లక్షల ఎకరాలకు పైగా సాగులో ఉందని తెలిపారు . రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్లే వచ్చిందన్నారు. దేశ రైతులను అర్థం చేసుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ దారుణంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ గడ్డ మీద సింహగర్జన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు. అందరం కలిస్తేనే మనం అనుకున్నా గమ్యం చేరుకోగలం అని అన్నారు.