
మనలో దాగి ఉన్న నైపుణ్యానికి సానబెట్టి ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని 21 ఫస్ట్ సెంచరీ ఐఎఎస్ అకాడమీ ఛైర్మన్ కృష్ణప్రదీప్ సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామ పంచాయతీ సమీపంలో కృష్ణ ప్రదీప్ సారధ్యంలో పదవ తరగతి, ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు శనివారంతో ముగిసింది. అవగాహన సదస్సుతో పాటు బ్రిడ్జి కోర్సు కూడా నిర్వహించారు. ముగింపు సదస్సుకు హాజరైన కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ సివిల్స్ ప్రిపరేషన్ ఇంటర్, డిగ్రీల నుంచే ప్రారంభించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని సూచించారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించవచ్చన్నారు. అన్నింటికీ మించి సివిల్స్ ప్రిపేర్ అయిన అభ్యర్ధి ఒక ఉత్తమ పౌరుడిగా ఎదుగుతారని పేర్కొన్నారు. కాగా ఈ అవగాహన సదస్సులో భాగంగా విద్యార్ధులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. దానిలో భాగంగా న్యూస్ పేపర్ చదవడం, ఎన్సిఈఆర్టి పుస్తకాలు చదవడం, మాక్ ఇంటర్వ్యూలు, మెరుగైన చేతి రాత, నైతిక విలువలు, నిర్ణయికరణ నైపుణ్యం, నాయకత్వ సామర్ధ్యం, సమస్య పరిష్కార సామర్ధ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఐఐఎస్ డాక్టర్ పద్మనాభరావు, ఐఎఎస్ డాక్టర్ జయప్రకాష్నారాయణ్, చేతి రాత నిపుణులు మల్లికార్జునరావు, విశ్రాంత చీఫ్ సెక్రటరీ మోహన్ కందా వంటి ప్రముఖులు విద్యార్ధులకు సూచనలు ఇచ్చారు. ముగింపు సందర్భంగా విద్యార్ధులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందచేశారు.