
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క పార్టీ ఫిరాయింపుదార్లపై నిప్పులు చెరిగారు. హస్తం గుర్తుతో గెలిచి, పార్టీ మారాల్సి వచ్చేసరికి నాయకత్వంపై నమ్మకం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారని, అసలు వీళ్లకు సిగ్గుందా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పార్టీ నేత జీవన్ రెడ్డికి సన్మానం జరిపిన సందర్భంగా భట్టి ఆవేశంగా మాట్లాడారు."ఇప్పుడు జీవన్ రెడ్డిని గెలిపించినట్టే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు ప్రజలు. పార్టీలు మారినవాళ్ల పరిస్థితి అప్పుడు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది" అంటూ ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నేతలపై ధ్వజమెత్తారు. తాము ఎప్పటికీ ప్రజల పక్షానే పోరాడుతాం తప్ప డబ్బుకు అమ్ముడుపోమని చురకలు అంటించారు. విలీనం అంటున్నారని, తమది జాతీయ పార్టీ అనీ, ఎప్పటికీ విలీనం కాదని స్పష్టం చేశారు.