
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని కోరారు. బాన్స్ వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి డిస్ క్వాలిఫికేషన్ నోటీస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్ తో కలిసి భట్టి బిక్రమార్క ఇచ్చారు. అనంతరం స్పీకర్ ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ మాట్లాడారు.
పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో 6 మంది ఎమ్మెల్యేలని డిస్ క్వాలిఫై చేయాలని గతంలో పిటీషన్ ఇచ్చాము.. అలాగే హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, జాలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని నోటీస్ ఇచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టపగలే ఖూనీ చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకు గురిచేసి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తక్షణం పదవుల నుంచి డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరినట్లు ఆయన చెప్పారు. అందుకు సంబంధించి పదో షెడ్యూల్ వివరాలను, అఫిడవిట్ ను స్పీకర్ కు అందించినట్లు భట్టి వివరించారు. స్పీకర్ హైదరాబాద్ లో లేకపోవడం వల్ల వారి నివాసం అయిన బాన్స్ వాడలో ఆయనను కలసి ఇచ్చామని అన్నారు.
జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ దీనిని ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తామని కొందరు టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యహారం అని.. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం అయిన సమయంలో గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకూ అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపి.. ఆ తరువాత విలీనం చేయడం జరిగిందని అన్నారు.