YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జగన్ స్టోరీతో బాలయ్య సినిమా... ఆగిపోయింది..

జగన్ స్టోరీతో బాలయ్య సినిమా... ఆగిపోయింది..

యువ్ న్యూస్  ఫిల్మ్ బ్యూరో:
 

‘జైసింహా’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సి. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది అంటూ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ చిత్రం ఎందుకు ఆగిపోతుందనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. అయితే, దీనికి కారణం వైఎస్ జగన్ సీఎం కావడమే అని రూమర్లు వినిపిస్తున్నాయి. జగన్ సీఎం అయితే బాలయ్య సినిమా ఆగిపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా! ఈ సినిమాలో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేయాల్సి ఉందట. ఫ్లాష్ బ్యాక్‌లో తాతగా.. ప్రస్తుతంలో మనవడిగా జగపతిబాబు కనిపిస్తారని టాక్. ఈ రెండూ విలన్ పాత్రలేనట. వాస్తవానికి ఈ పాత్రలను వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్‌లను గుర్తుచేసేలా స్క్రిప్టులో దర్శకుడు రాసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ఇలాంటి సమయంలో ఈ కథతో సినిమా చేస్తే అంత మంచిది కాదని నిర్మాతతో పాటు బాలయ్య వెనక్కి తగ్గారట. అందుకే, చడీచప్పుడు కాకుండా ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టేయాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ స్క్రిప్టు మార్చాలనుకున్నా అది ఇప్పుడప్పుడే అయ్యే పనికాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, కె.ఎస్.రవికుమార్ మాత్రం కథను మార్చుదామని, సినిమాను పక్కన పెట్టొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమానే గనుక బాలయ్య పక్కన పెట్టేస్తే.. వెంటనే బోయపాటి శ్రీనుతో కొత్త చిత్రం ప్రారంభమైపోతుంది. వాస్తవానికి కె.ఎస్.రవికుమార్ కన్నా బోయపాటితో సినిమా అంటేనే నందమూరి అభిమానులకు ఎక్కువ కిక్. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి పవర్‌ఫుల్ చిత్రాలు వచ్చాయి. చూద్దాం ఏం జరుగుతుందో..! 
 

Related Posts