YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

గోదావరి నదీ జలాల వినియోగంపై కేసీఆర్, జగన్‌ చర్చ

 గోదావరి నదీ జలాల వినియోగంపై కేసీఆర్, జగన్‌  చర్చ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు జూన్ 28న మరోసారి సమావేశం కానున్నారు. ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్, జగన్ చర్చించనున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్ వంటి అంశాలపై చర్చిస్తారని సమాచారం. జూన్ 29న కూడా ఇరువురు సీఎంలు మరోసారి భేటీ అవుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.పలు కార్యక్రమాల నేపథ్యంలో వైఎస్ జగన్ జూన్ 26నే హైదరాబాద్‌కి రానున్నారు. 29 వరకు ఆయన నగరంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై ఇరు రాష్ట్రాల జలవివాదాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరు ఇరువురూ కలవడం ఇది నాలుగోసారి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి నదీ జలాల వినియోగంపై కేసీఆర్, జగన్‌ మధ్య చర్చ జరిగింది. సముద్రంలోకి వృథాగా
పోతున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి కృష్ణా నదిలోకి మళ్లించాలన్న ఆలోచనకు మరింత పదును పెరుగుతోంది. దీనిపై కసరత్తు చేస్తున్న ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, ఏపీలో ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు నీరు సక్రమంగా అందజేయాలంటే గోదావరి నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నదానిపై చర్చిస్తున్నారు. ఇక, గోదావరిలో ఇంద్రావతి కలిసిన తర్వాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించే అవకాశం ఉంటుందని, ఇరు రాష్ట్రాలు సహకారంతో కరవు జిల్లాలకు వరద జలాలను వినియోగించుకోవచ్చని కేసీఆర్‌ సూచించారు. ఈ సూచనకు సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, దీనిపై ఉన్నతస్థాయి అధికారులతోనూ చర్చించారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం నీటి మళ్లింపు సామర్థ్యాన్ని రోజుకు ఒక టీఎంసీకి పెంచడంపైనా సీఎంల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జూన్ 28న హైదరాబాద్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు దీనికి
సంబంధించిన ఎజెండా ఇతర అంశాలపై సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించడంపైనే కేసీఆర్, జగన్ మధ్య ప్రధాన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గోదావరికి వరద వచ్చే మూడు నెలల సమయంలో 250 నుంచి 300 టీఎంసీల నీటిని మళ్లించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నీటి అవసరం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం, కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే నీరు, అదనంగా ఎంత అవసరం అనే అంశాలు ఆధారంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. జల వివాదాలకు సంబంధించిన ఇతర అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, జూన్ 28న భేటీ గురించి అధికారికంగా సమాచారం లేకున్నా సీఎంల సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తోనూ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో చర్చించారు. నీటిని
మళ్లించే ప్రతిపాదనల గురించి ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఇంజినీర్లు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకొంటున్నారు.

Related Posts