యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తుందని దీనికి ఎలాంటి దిగులు అవసరం లేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం షాద్ నగర్ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి కలెక్టర్ లోకేష్ కుమార్ తో పాటు జాయింట్ కలెక్టర్ హరీష్, స్థానిక ఆర్ డి ఓ కృష్ణ నియోజకవర్గములోని ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ను మీడియా కలువగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 18వేల మ్యూటేషన్స్ పూర్తయ్యాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో దీనికోసం ఆధార్ లింక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. చాలా మంది రైతులు స్థానికంగా లేకపోవడం తదితర సమస్యల వల్ల ఈ సమస్యలు ఉత్పన్న
మవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులు వెంటనే ఆధార్ లింక్ లను సరి చేసుకోవాలంటే ఆధార్ కార్డులలో సరైన సమాచారంతో లింక్ చేసుకోవాలని కోరారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభల ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తామని మొదటి విడత పూర్తయిందని అవసరమైతే రెండో విడత ద్వారా సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో అవసరమైన సందర్భాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు సత్వర పరిష్కారం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. ఏలాంటి సమస్యలు ఉన్న ప్రజలు నిర్భయంగా అధికారులకు తెలియ జేయవచ్చని సూచించారు. భూముల క్రయ విక్రయాలు చేసిన వారికి రెండో పేజీలో వివరాలు పెట్టే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఇలా పదిహేను వేల పాసుబుక్కులు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు. రైతులకు నేరుగా పాస్ బుక్స్ అందించే విషయమై ప్రస్తావిస్తూ.. పోస్టుల ద్వారా రైతులకు పుస్తకాలు పంపడం సాధ్యం కాదని అవి పోస్టు ద్వారా రైతుకు పంపాలంటే పోస్టల్ ఛార్జీల సమస్య తలెత్తుతుందని,దీనికి నిధులు ఎలా సమకూరుతాయో పరిశీలించాలని అన్నారు. చాలా మంది రైతుల చిరునామాలు కూడా సరిగ్గా లేవని ఇది కూడా ఒక సమస్య అని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సత్వరమే రెవెన్యూ యంత్రాంగం కృషి చేసే విధంగా చర్యలు చేపడతామని ఆ దిశగా ముందుకు సాగుతామని లోకేష్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలతో వచ్చారు. షాద్ నగర్ పట్టణ సిఐ శ్రీధర్ కుమార్ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా ఫరూక్ నగర్ తహసిల్దార్ రాజేశ్వర్ రెడ్డి మరియు ఇతర మండలాలకు చెందిన తహసీల్దార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.