YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హెచ్ సీఏను బలోపేతం చేస్తా : అజహరుద్దీన్.

హెచ్ సీఏను బలోపేతం చేస్తా : అజహరుద్దీన్.

హెచ్ సీఏను బలోపేతం చేస్తా : అజహరుద్దీన్..
హైద్రాబాద్, సెప్టెంబర్ 30,
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌ (హెచ్‌సీఏ)లో నీచ రాజకీయాల కారణంగా హైదరాబాద్ క్రికెటర్లు వెలుగులోకి రాలేకపోయారని ఇటీవల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అరోపించాడు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం పోటీపడిన అజ్జూకి.. అసోషియేషన్ పెద్దల తెర వెనుక రాజకీయాల కారణంగా అవమానాలు ఎదురయ్యాయి. ఎంతలా అంటే..? అప్పట్లో అతని నామినేషన్ తిరస్కరణకి గురవగా.. ఎన్నికల రోజు కనీసం అతడ్ని ఉప్పల్ స్టేడియంలోకి కూడా అనుమతించలేదు. కానీ.. గత శుక్రవారం అదే స్టేడియంలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 147 ఓట్లు సాధించిన అజహరుద్దీన్.. ప్రత్యర్థిపై 74 ఓట్ల ఆధిక్యంతో గెలిచి తాజాగా అధ్యక్ష పదవిని చేపట్టాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2000లో అజహరుద్దీన్ క్రికెట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.హెచ్‌సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో అజహరుద్దీన్ మాట్లాడుతుండగా.. ‘మీరు, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత భారత్ జట్టులో ఏ హైదరాబాద్ క్రికెటర్ కూడా సుస్థిర స్థానం దక్కించుకోలేకపోయారు కారణం..?’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి అజ్జూ సమాధానమిస్తూ ‘అవును హైదరాబాద్ క్రికెటర్‌కి భారత్ జట్టులో స్థానం దక్కకపోవడం నన్ను చాలా నిరాశపరిచింది. ఏం ఒక్క ఆటగాడు కూడా టీమిండియా ప్రమాణాలకి తగినట్లు లేడా..? మహ్మద్ సిరాజ్ ఇటీవల జట్టులోకి వచ్చి వెళ్లాడు. కానీ.. ప్రస్తుతం ఎవరూ లేరు. అయినా.. క్రికెటర్లు ఆ స్థాయికి చేరుకోవాలంటే వారికి తగిన ప్రోత్సాహం కావాలి. కానీ.. హెచ్‌సీఏ గత కొంతకాలంగా అంతర్గత కుమ్ములాటలతోనే కాలయాపన చేసింది. గత అసోషియేషన్ ఎన్నికలు పూర్తిగా అక్రమంగా జరిగాయి. ఎన్నికైన టీమ్ కూడా అలాంటిదే. వారి నీచ రాజకీయాల కారణంగా ఆటగాళ్లు చాలా నష్టపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉప్పల్ స్టేడియాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చిన అజహరుద్దీన్.. హెచ్‌సీఏలో ఇకపై అవినీతికి తావు ఉండబోదని స్పష్టం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ క్రికెట్ వృద్ధి‌కి చేయూతనిస్తామన్న ఆయన ప్యానల్ సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపాడు. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద, జాయింట్ సెక్రటరీగా సురేందర్ అగర్వాల్, ట్రెజరీగా నరేశ్ శర్మ బాధ్యతలు చేపట్టారు.భారత్ జట్టులోకి 1984లో అరంగేట్రం చేసిన అజహరుద్దీన్.. కెరీర్ ఆరంభంలో ఆడిన మూడు టెస్టుల్లోనూ సెంచరీలు బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో 334 వన్డేలు, 99 టెస్టులు ఆడిన ఈ మాజీ కెప్టెన్.. అనూహ్యంగా ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుని క్రికెట్ నుంచి వైదొలిగాడు. విచారణలో అజ్జూ దోషిగా తేలడంతో.. అతనిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. కానీ.. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్.. అప్పటి వరకూ అజహరుద్దీన్‌పై విధించిన నిషేధం చట్ట వ్యతిరేకమని తీర్పుని వెలువరించింది. దీంతో.. ఈ మాజీ కెప్టెన్‌కి నిషేధం నుంచి ఉపశమనం లభించింది.

Related Posts