
ఆ ఆరుగురు జలసమాధే
నల్గొండ,
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం కాలువలో నుంచి కారును ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు.. ఆ కారులో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయిప్రమాదంలో చనిపోయిన వారంతా హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో ఉన్న అంకుర్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. వీరంతా చాకిరాలలో తమ సహోద్యోగి విమలకొండ మహేష్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను అబ్దుల్ అజీజ్(వైజాగ్), జిన్సన్(కేరళ), రాజేష్, సంతోష్(హైదరాబాద్), పవన్, నగేష్(మల్కాజిగిరి)గా గుర్తించారు.చనిపోయిన ఆరుగురు శుక్రవారం (అక్టోబర్ 18) ఉదయం తమ సహోద్యోగి వివాహ వేడుకకు హాజరయ్యారు. కారులో ఆరుగురు హైదరాబాద్ బయలుదేరగా.. మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల దగ్గర కారు వేగంగా వెళ్లి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు.. గల్లంతైన వారికోసం గాలింపు మొదలు పెట్టారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలగగా.. శనివారం మధ్యాహ్నం కారును బయటకు తీశారు.