YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

 పాఠశాలలు పక్కా (ఖమ్మం)

 పాఠశాలలు పక్కా (ఖమ్మం)

 పాఠశాలలు పక్కా (ఖమ్మం)
ఖమ్మం, డిసెంబర్ 23: జిల్లాలో ఎంఈఓలకు ఒక విధంగా ఊరట దక్కింది. ఇప్పటి వరకు ఎంఈవోలకు ఉన్న ఈ అధికారాలకు ఇప్పుడు కత్తెర పడింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికే అనేక బాధ్యలతో సతమతమవుతున్న ఎంఈవోలకు ఈ నిర్ణయం కొంత శ్రమ తగ్గిందనే చెప్పుకోవచ్ఛు. ఖమ్మం జిల్లాలో మొత్తం 21మండలాలు ఉన్నాయి. వీటిలో కేవలం ముగ్గురు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవోలు ఉన్నారు. మిగతా వారంతా ఇన్‌ఛార్జి బాధ్యతల్లోనే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం 11మంది మాత్రమే మండల విద్యాశాఖ అధికారులుఉన్నారు. వీరే మిగతా 12మండలాలకు ఇన్‌ఛార్జులుగా పని చేస్తున్నారు. ఈ జిల్లాలో ఒక్కరు కూడా రెగ్యులర్‌ ఎంఈవోలు లేరు. అంతా ఇన్‌ఛార్జులే. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బాధ్యతలతోపాటు అదనంగా ఎంఈవో విధులు నిర్వహించాల్సి వస్తుంది. జూలూరుపాడు మండలం పాపకొల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన బాధ్యతలతోపాటు అదనంగా జూలూరుపాడు, చండ్రుగొండ, సుజాతనగర్‌, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం మండలాలకు ఎంఈవోగా పని చేస్తున్నారు. ఇలా ఒక్కో ఎంఈవోపై విపరీతంగా భారం పెరిగింది. ఒక్కో మండలంలో సుమారు నలుగురు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. వీరికి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అధికారాల వల్ల స్కూల్‌ కాంప్లెక్స్‌ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. వీటిని పటిష్ఠం చేసే ఆలోచన ఎప్పటి నుంచో ప్రభుత్వం చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పాఠశాలలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. ఉపాధ్యాయుల సెలవుల మంజూరు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దాని ద్వారానే సెలవును ఆన్‌లైన్‌ చేస్తే.. మంజూరు చేయాలి. ఒక వేళ ఆన్‌లైన్‌ పనిచేయని పక్షంలో ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు తీసుకుని సాధ్యమైనంత త్వరలో దాన్ని మళ్లీ ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. మండల విద్యాశాఖ అధికారుల అధికారాలను వికేంద్రీకరించటం వల్ల వారికి కొంత వెసులుబాటు లభించే అవకాశం ఉంది. ఒక్కో ఎంఈవో పరిధిలో సుమారు 40నుంచి 50పాఠశాలలు ఉన్నాయి. విద్యావాలంటీర్లు, మధ్యాహ్నభోజన పథకం, తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు చూడటం, సమీక్ష సమావేశాలకు హాజరు కావటం లాంటి అనేక పనులతో మండలంలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షించటం వీరికి కొంత భారంగా ఉంది. ఇప్పుడు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు కూడా వారి పరిధిలోని పాఠశాలలపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉండే అవకాశం ఉంది. కొన్ని ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. ఇలాంటి చోట ఉన్నత పాఠశాలతోపాటు దాని కాంప్లెక్స్‌ పరిధిలోని పీఎస్‌, యూపీఎస్‌లకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉన్న చోట వెంటనే ప్రధానోపాధ్యాయుడి పోస్టు నింపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పర్యవేక్షణ పెరగటం వల్ల స్కూల్‌ కాంప్లెక్స్‌లలో సౌకర్యాలు మెరుగుపరిచి వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఒక క్లర్కు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, నాలుగో తరగతి సిబ్బందిని నియమిస్తేనే నూతన వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. ఎంఈవోలకు ఇప్పుడున్న అధికారాల్లో కోత విధించటం వల్ల ఎంఈవోల అధికారులు ఇక నుంచి ఎలా ఉంటాయో ఉత్తర్వుల్లో స్పష్టం చేయలేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా మందిలో హర్షం వ్యక్తమవుతోంది.

Related Posts