YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం సినిమా ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో స్టూడియో కోసమే... చిరు జై కొట్టారా

విశాఖలో స్టూడియో కోసమే... చిరు జై కొట్టారా

విశాఖలో స్టూడియో కోసమే... చిరు జై కొట్టారా
హైద్రాబాద్, డిసెంబర్ 23, 
రాజధాని విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి మెగాస్టార్ చిరంజీవి జైకొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజధానుల విషయంలో చిరంజీవి విడుదల చేసిన ప్రెస్ నోట్ ఫేక్ అంటూ మరో ప్రెస్ నోట్ రిలీజైంది. కానీ రెండోసారి రిలీజైందే నకిలీదని తేలింది. మూడు రాజధానుల విషయమై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానన్నారు.దిశ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత జగన్‌ను ప్రశంసించిన చిరంజీవి.. తాజాగా రాజధానుల విషయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం ఆసక్తికరంగా మారింది. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిసినా చిరంజీవి ఇలా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు జనసేనలో ఉండగా.. ప్రజారాజ్యం పార్టీ అనుభవాలతో చిరంజీవి గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో బిజీగా మారిన చిరు.. సైరా విడుదల తర్వాత సీఎం జగన్‌ను కలిశారు. అప్పటి నుంచి ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జగన్‌ను చిరంజీవి కలిసినప్పుడు ఆయన వెంటే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వెళ్తారని ప్రచారం జరిగింది. గంటా వైసీపీ గూటికి చేరాలని చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో.. జగన్‌ను ఒప్పించే బాధ్యతను చిరు తీసుకున్నారనే వార్తలూ వచ్చాయి. కానీ ఆఖరి నిమిషంలో గంటా ఆ భేటీకి దూరమయ్యారు. చిరంజీవి దంపతులు మాత్రమే సీఎం నివాసానికి వెళ్లొచ్చారు.జగన్ మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటన చేయగానే టీడీపీ మండిపడింది. కానీ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా మాత్రం జగన్ ప్రకటనను స్వాగతించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడానికి అన్ని అర్హతలూ విశాఖకు ఉన్నాయన్నారు. రాజధానుల ప్రకటనకు జనసేన వ్యతిరేకంగా ఉందని తెలిసి కూడా చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్థించారు.విశాఖ పరిసర ప్రాంతాల్లో గంటా శ్రీనివాసరావుకు భారీగా భూములు ఉన్నాయనే వార్తలొచ్చాయి. విశాఖలో ప్రభుత్వ భూములు స్కామ్ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం సిట్ వేసి విచారణ జరిపింది. కానీ రిపోర్టును బయటపెట్టలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సిట్ వేశారు. దీన్ని గంటా సైతం స్వాగతించారు. ఇక్కడ చిరంజీవికి కూడా భూములు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.విశాఖలో స్టూడియో నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని సీఎం జగన్‌ను చిరంజీవి కోరారని.. అందుకోసమే ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ.. చిరంజీవి, గంటా ఒకే తరహాలో స్పందించడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఆ తమ్ముడి కోసం చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. రాజకీయంగా పవన్, నాగబాబు ఆ గట్టున నిలిస్తే.. చిరంజీవి మాత్రం ఈ గట్టున నిలిచారని భావించాలేమో.

Related Posts