అమరావతికి ఘన చరిత్ర వుంది
అమరావతి జనవరి 14
మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న రాజధాని గ్రామ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బెంజ్ సర్కిల్ వద్ద భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్రావు, బీసీజీ నివేదికలను నేతలు భోగిమంటల్లో తగులబెట్టారు. చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడం లేదన్నారు. అమరావతికి ఘన చరిత్ర ఉందని, అమరావతి కేంద్రంగా వేల ఏళ్ల క్రితమే రాజ్యం ఉండేదని తెలిపారు. అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు. అమరావతిని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేశారని గుర్తు చేశారు. తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని...ఒకప్పుడు మద్రాస్ అభివృద్ధికి, తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. అమరావతిని చించాలంటే భవిష్యత్ ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. భోగి మంటల కార్యక్రమంలో రాజధాని రైతులు, మహిళలు, యువత భారీగా హాజరయ్యారు.