YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

కొండంత బకాయిలు

కొండంత బకాయిలు

కొండంత బకాయిలు (కృష్ణాజిల్లా)
అమరావతి, ఫిబ్రవరి 24 ఫీసు రీయింబర్స్ మెంట్ బకాయిలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పలు పేరున్న కళాశాలలు ఇక్కడ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బోధన రుసుము బకాయిలతో విద్యార్థులు, బోధకులు, యాజమాన్యాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో గత రెండు మూడు నెలలుగా లెక్చరర్లకు జీతాలు ఇవ్వడం లేదు. మరికొన్ని కళాశాలల్లో సగం జీతాలు ఇచ్చి నెట్టుకొస్తున్నారు. గత ఏడాది బోధన రుసుము బకాయిలు భారీగా రావాల్సి ఉండడంతో.. అసలు కళాశాలలు నడపడమే కష్టంగా మారిందనే ఆవేదన యాజమాన్యాల నుంచి వస్తోంది. రెండు జిల్లాల్లో ఉండే ప్రధాన కళాశాలలకు ఒక్కోదానికి రూ.30 కోట్ల వరకూ బకాయిలు రావాల్సి ఉంది. మిగతా కళాశాలకు సైతం రూ.3కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ల్యాబ్‌లు వంటి వాటి విషయంలో కత్తెర వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇది విద్యార్థులకు భవిష్యత్తులో తీవ్రమైన దెబ్బ కొట్టబోతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 74 వరకూ ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వీటిలో పెద్ద కళాశాలలు పది వరకూ ఉన్నాయి. ఇరు జిల్లాల్లోని కళాశాలలకు కలిపి సుమారు రూ.600కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించిన బోధన రుసుములు ఎంతనేది ఇంకా తేలని పరిస్థితి ఉండగా.. పాత బకాయిలు రాకపోవడంతో కళాశాలల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు అప్పులు తెచ్చి ఉద్యోగులకు జీతాలు ఇస్తుండగా.. మరికొన్నిచోట్ల ఇవ్వలేక వాయిదాలు వేసే పద్ధతి నెలకొంటోంది. దీంతో నెలవారీ జీతాలపై బతికే కళాశాల ఉద్యోగులు, వారి కుటుంబాల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కొన్నిచోట్ల జీతాలు ఇవ్వాలని గట్టిగా అడిగితే కొలువులు వదిలి వెళ్లిపోవాలనే సమాధానం యాజమాన్యాల నుంచి వస్తోందని వాపోతున్నారు. ఏటా.. ఈ సమయానికి కళాశాలల్లో కొత్త అధ్యాపకులు కావాలంటూ ప్రకటనలు కుప్పలుతెప్పలుగా ఉండేవి. కానీ.. గత ఏడాదిగా అలాంటి ప్రకటనలు లేకపోవడంతో.. ఒకవేళ ఉన్న ఉద్యోగం వదిలి బయటకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం కావడం లేదని.. పలువురు లెక్చరర్లకు వాపోతున్నారు. ఇంటి అద్దెలు, బ్యాంకు రుణాలు, మనుగడ ఇవన్నీ జీతం లేకుండా నెట్టుకురావడం అసాధ్యమేనని.. మానసికంగా కుంగిపోతున్నామన్నారు. ఇరు జిల్లాల్లోని కొన్ని కళాశాలల్లో చాలాకాలంగా అభివృద్ధి కోసం దాచి ఉంచిన మూలధనంతో సిబ్బందికి జీతాలిస్తూ నెట్టుకొస్తున్నా వాళ్ల పరిస్థితి కూడా మరో రెండు మూడు నెలలు పోతే ఇబ్బందికరంగానే మారనుందని పేర్కొంటున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని అధ్యాపకులకు వారి స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2లక్షల వరకూ జీతాలు ఉన్నాయి. పీహెచ్‌డీ కలిగిన ప్రొఫెసర్‌ స్థాయి వాళ్లకు రూ.1.35లక్షల నుంచి రూ.1.80లక్షల వరకూ జీతాలున్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్లకు రూ.60 వేల నుంచి రూ.98వేల వరకూ ఉంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ జీతాలున్నాయి. ఆల్‌ఇండియా కౌన్సిల్‌ ఫర్‌  టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం కళాశాలలో ప్రతి 15మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. అధ్యాపకుల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 1ః2 ః4 పద్ధతిలో ఉండాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం యాజమాన్యాలే అప్పుల పాలైపోతుండడంతో నాణ్యమైన విద్యను బోధించే అధ్యాపకులను తెచ్చే పరిస్థితి ఉండడం లేదు. కళాశాలల మనుగడ కోసం ఏం చేయాలనే దానిపై.. యాజమాన్యాలు వరుస సమావేశాలను పెడుతూ.. సమాలోచనలు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొన్నాళ్లు కొనసాగితే.. కళాశాలలను మూసేయడం లేదంటే డిగ్రీలాంటి ఇతర కోర్సులను ఆరంభించడం, ఇంజినీరింగ్‌ ప్రవేశాలను తగ్గించుకోవడం.. లాంటి పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నాణ్యత కలిగిన అధ్యాపకులను  నియమించుకునే పరిస్థితి ఉండకపోగా.. ఉన్న వారినీ కాపాడుకోలేకపోతున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో అసలే సాంకేతిక నైపుణ్యాలు తక్కువ ఉన్నాయనే ఆందోళన అంతటా వ్యక్తమవుతుంటే.. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోనుంది. ఇప్పుడు కళాశాలల్లో ఉన్న విద్యార్థులు 2023 తర్వాత బయటకు వస్తారు. కానీ.. ఆ సమయానికి వీళ్లకు నైపుణ్యం లేకపోతే.. ఇంక ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts