శుక్రవారం నుంచి ఉచిత బియ్యం పంపిణి
సికింద్రాబాద్ మార్చ్ 26
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ‘లాక్ డౌన్’ దృష్ట్యా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల దుకాణాల ద్వారా ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణి ప్రక్రియను సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం నుంచి చేపట్టనున్నట్లు తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలో బియ్యం పంపిణి ఏర్పాట్లను నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షించారు. సికింద్రాబాద్ సర్కిల్ పౌర సరఫరాల అధికారి మహమ్మద్ అలీ తో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి మాట్లాడుతూ నిరుపేదలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజలందరికి బియ్యం అందించేందుకు ఏర్పాట్లు జరపాలని, ఆయితే వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని సామజిక దురాన్ని పాటించడం, విధిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం వంటి ఏర్పాట్లు తప్పనిసరని అయన సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమంది, బౌదనగర్ డివిజన్లకు సంబంధించిన 56 రేషన్ దుకాణాల ద్వారా అర్హులైన దాదాపు 50 వేల మంది కార్డు దారులకు ఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందిస్తామని తెలిపారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద జీహెచ్ఎంసీ కి సంబంధించిన బిల్లు కలెక్టర్ తో పాటు పొలిసు సిబ్బంది సేవలు అవసరమని పౌర సరఫరాల అధికారి మహమ్మద్ అలీ తెలిపారు. తొలుత టోకెన్ లను జారి చేస్తామని, క్రమ పద్దతిలో బియ్యం పంపిణి చేస్తామని తెలిపారు. అర్హులందరికీ బియ్యం అందించేందుకు ఏర్పాట్లు ఉంటాయని, రద్దీ ని సృష్టించి ఇబ్బంది పడరాదని పద్మారావు గౌడ్ ఈ
సందర్భంగా పేర్కొన్నారు.