YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

500 బస్తాలకు మిర్చికి బూజు..

500 బస్తాలకు మిర్చికి బూజు..

500 బస్తాలకు మిర్చికి బూజు..
ఖమ్మం, మే 23
జిల్లాలోని పలు కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసుకున్న మిర్చి బస్తాలకు బూజు పట్టడం కలకలం రేపుతోంది. దాదాపు వారం రోజుల క్రితం తల్లాడ మండలంలో ఓ కోల్డ్ స్టోరేజీ దగ్గర మిర్చి బస్తాలు బూజు పట్టడంపై రైతులు ఆందోళనకు దిగగా,  ఖమ్మం రూరల్మండలంలోని ఎం.వెంకటాయపాలెం సమీపంలోని రాఘవేంద్ర సాయిశ్రీ కోల్డ్ స్టోరేజీ దగ్గర రైతులు ఆందోళన చేశారు. బస్తాల్లోని మిర్చికి బూజు రావడం, రంగు మారడానికి కారణం మీరంటే మీరంటూ కొంత సేపు వాగ్వాదం పెట్టుకున్నారు. రైతులు తేమ శాతం ఎక్కువగా ఉన్న మిర్చిని నిల్వ చేయడం వల్ల బూజు వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. లాట్ వేయడంలో సరైన పద్ధతి పాటించకపోవడం, ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. అయితే.. కోల్డ్ స్టోరేజీల్లో నిర్వహణ లోపాలు కొత్తేం కాదని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది దాదాపు 52 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. రెండోసారి, మూడో సారి తీసిన మిర్చిని అమ్ముకునే సమయంలో లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో పంటను నిల్వ చేసుకునేందుకు రైతులు కోల్డ్ స్టోరేజీలను ఆశ్రయించారు. డబ్బు అవసరం అనుకున్న రైతులు తక్కువ ధరకే అమ్ముకోగా, వ్యాపారులు కూడా వాటిని కొనుక్కొని కోల్డ్ స్టోరేజీలకు తరలించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 37 కోల్డ్ స్టోరేజీలు దాదాపు పూర్తి సామర్థ్యంతో నిండిపోయాయి. దాదాపు 30 లక్షలకు పైగా బస్తాలు వీటిలో నిల్వ చేసినట్టు వాటి నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా బస్తాలను స్టాక్పెట్టుకున్న రైతులు అప్పుడప్పుడు వాటిని తనిఖీ చేసుకోవడం సాధారణమే. ఈ సమయంలో ఎంవీ పాలెంలోని రాఘవేంద్ర సాయిశ్రీ కోల్డ్ స్టోరేజీలో 500 బస్తాల వరకు మిర్చి బూజు పట్టడం, రంగు మారడాన్ని గుర్తించారు. దీనిపై నిర్వాహకులకు ప్రశ్నించగా, రైతుల తప్పేనంటూ దబాయించడంతో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులు, సిబ్బందితో మాట్లాడారు. బూజుపట్టిన మిర్చిని ఆరబెట్టి మళ్లీ రెండ్రోజుల తర్వాత కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసేలా ఇరువురికీ సర్దిచెప్పారు.సాధారణంగా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి పాడుకాకుండా ఉండేందుకు 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేస్తూ ఏసీని నడిపిస్తుంటారు. వీటి పర్యవేక్షణకు ఒక టెక్నికల్ ఇంజినీర్అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు టెంపరేచర్‌‌ను చూస్తుంటాడు. అయితే చాలా వాటిలో అందుబాటులో ఉన్న సిబ్బందితోనే వీటిని నడిపిస్తున్నారని తెలుస్తోంది. కరెంటు చార్జీల భారం తగ్గించుకునేందుకు రాత్రి సమయాల్లో ఏసీని బంద్చేస్తుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మిర్చి కూడా రంగు మారుతుందని చెబుతున్నారు. ఇక మిర్చి బస్తాలను నిల్వ చేసే సమయంలో తేమ శాతాన్ని నమోదు చేయాల్సి ఉండగా, స్టోరేజీలను త్వరగా నింపాలనే తొందరలో నిర్వాహకులు నిబంధనలను పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సామర్థ్యాన్ని మించి బస్తాలు నిల్వ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.అమ్ముకునేందుకు మార్కెట్ లేకపోవడం వల్ల మిర్చీని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశాను. ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం నల్లగా మారింది. బూజుపట్టి ఉంది. ఏసీ సరిగా నడపడం లేదని అనుమానముంది. నిల్వ చేస్తున్న సమయంలో మిర్చిని బాగా ఎండబెట్టి బస్తాల్లో తీసుకువచ్చాం. ఇప్పుడేమో తేమ శాతం ఎక్కువ ఉండడంతోనే బూజు వచ్చిందని, తప్పు మాదేనని అంటున్నారు. లాక్ డౌన్‌కు ముందు క్వింటాకు రూ.15 వేల వరకు రేటు ఉండగా, ఇప్పుడు బూజు పట్టడం వల్ల క్వింటా రూ.5 వేలు కూడా రావు. ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులపై చర్య తీసుకోవాలి.

Related Posts