కన్నడలో మూడు ముక్కలాట
బెంగళూర్,
ఉప ఎన్నికలే... తక్కువ స్థానాలే. ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటముల వల్ల ప్రభుత్వం పై ఏమాత్రం ప్రభావం చూపబోవు. అంతేకాదు ఇక మూడున్నరేళ్లు మాత్రమే శాసనసభకు కాలపరిమిత ఉంది. అయినా సరే కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర, శిర శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.నిజానికి ఈ ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని చెప్పకతప్పదు. గత శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు విడిగా పోటీ చేశాయి. అయితే అతి పెద్ద పార్టీగా బీజేపీ, అతితక్కువ స్థానాలతో జేడీఎస్ నిలిచింది. కానీ అతి తక్కువ స్థానాలొచ్చిన జేడీఎస్ కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేశాయి.కానీ లోక్ సభ ఎన్నికల్లో తుముకూరు నుంచి కాంగ్రెస్, జేడీఎస్ ల అభ్యర్థిగా పోటీ చేసిన దేవెగౌడతోపాటు, ఆయన మనవడు నిఖిల్ గౌడ మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పోలయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తమకు సహకరించలేదని జేడీఎస్ బహిరంగంగానే విమర్శలకు దిగింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేవెగౌడను రాజ్యసభకు పంపింది. అప్పటి నుంచి జేడీఎస్ అడ్డం తిరగడం ప్రారంభించింది.తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రకటించారు. శిర నియోజకవర్గం నుంచి అమ్మాజమ్మను తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక రాజరాజేశ్వరి నగర్ లోనూ పోటీకి జేడీఎస్ సిద్ధమయింది. ఇక్కడ ఒక్కలిగ సామాజిక వర్గం కీలకంగా ఉండటంతో అన్ని పార్టీలూ ఆ సామాజికవర్గ అభ్యర్థినే ప్రకటించాయి. కాంగ్రెస్ దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి సతీమణి కుసుమను రంగంలోకి దించింది. రెండు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది ఒకరకంగా బీజేపీకి లాభించే అంశమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి