YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంటర్ బోర్డులో లీలలు ఇంతింత కాదయా

ఇంటర్ బోర్డులో లీలలు ఇంతింత కాదయా

హైదరాబాద్, ఏప్రిల్ 9, 
వడ్డించేవాడు మనవాడే అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు. ప్రస్తుతం తెలంగాణ ఇంటర్‌ బోర్డులో అదే జరుగుతోందట. డ్యూటీకి డుమ్మాకొట్టి ఊస్టింగ్‌ అయిన ఉద్యోగికి మళ్లీ పోస్టింగ్‌ ఇచ్చారు. అదే ఇంటర్‌ విద్యా విభాగంలో దుమారం రేపుతోంది.
ప్రభుత్వ ఉద్యోగి చెప్పకుండా విధులకు డుమ్మా కొట్టారు. అలాంటి వారిపై ఆయా విభాగాలు చర్యలు తీసుకోవడం సాధారణం. ఎక్కువ రోజులు డ్యూటీకి రాకపోతే ఉద్యోగ నుంచి తొలగిస్తాయి.  సర్వీస్‌ నిబంధనల ప్రకారం ఒక ఏడాదిపాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా  విధులకు రాకపోతే  ఆ జాబ్‌కు రిజైన్‌ చేసినట్టుగా భావిస్తారు. ఇంత పక్కాగా రూల్స్‌ ఉండటంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ రూల్స్ పరిధిలోకే వచ్చే ఇంటర్‌ విద్యాశాఖ మాత్రం కాస్త భిన్నమైన లైన్‌ ఎంచుకుంది. 1998 పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా  జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికైంది ఓ మహిళ.  కరీంగనగర్‌ జిల్లాలో జువాలజీ లెక్చరర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. 2003 నుంచి ఆమె విధులకు రావడం లేదట. పై అధికారులకు కూడా సమాచారం లేదని చెబుతున్నారు.  అప్పటి నుంచి దాదాపు 17 ఏళ్లపాటు ఆమె విదేశాల్లో ఉన్నారని ఇంటర్‌ విద్యా శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆమె ఇటీవలే స్వదేశానికి వచ్చారట. వస్తూ వస్తూనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కోరడం.. ఆమె అడిగిందే తడవుగా గతంలో కరీంనగర్‌ జిల్లాలో పనిచేసిన చోటే తిరిగి లెక్చరర్‌గా ఉద్యోగం ఇవ్వడం జరిగిపోయింది.   మార్చి 31న ఈ ఉత్తర్వులు ఇచ్చేశారు. తెలుసుకున్న ఇంటర్‌ విద్యాశాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయట. ప్రభుత్వానికి ఫైల్‌ పంపించకుండా.. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఆమెకు పోస్టింగ్‌ ఎలా ఇచ్చారన్నది మిస్టరీగా ఉందట. ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ఉంది. ఆమె విషయంలో రూల్స్‌ను అన్నింటినీ పక్కన పెట్టిన విధానమే అధికారులు, ఉద్యోగ వర్గాల్లో చర్చకు కారణం అవుతోంది. ముందస్తు సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టిన 56 మంది అధ్యాపకులను ఇంటర్‌ విద్యాశాఖ 2011లో తొలగించింది. ఆ జాబితాలో ఆమె కూడా ఉన్నారట.  అయితే ఇప్పుడా ఫైల్‌ ఇంటర్‌ విద్యా కమిషనరేట్‌లో కనిపించడం లేదట. ఆ ఫైల్‌ను మాయం చేసి పోస్టింగ్‌ ఇచ్చారా? తెర వెనక ఏం జరిగిందన్నది మిస్టరీగా మారింది. రాజీనామా చేసినా.. విధుల నుంచి తొలగించినా.. సదరు ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకొనే అధికారం ఒక్క  ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది. దానిని స్పెషల్‌ కేసుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ నిబంధనను కూడా తుంగలో తొక్కినట్టు తెలుస్తోంది. మరి.. ఈ సమస్య వెనక మిస్టరీ వీడుతుందో.. అసలేం జరిగిందో గుట్టు బయటపడుతుందో చూడాలి.

Related Posts