YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ముందుకు మూడుడగులు వెనుకకు అడుగులు సాగునీటి ప్రాజెక్టులు

ముందుకు మూడుడగులు వెనుకకు అడుగులు సాగునీటి ప్రాజెక్టులు

ఏలూరు, జూన్ 10, 
 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. మార్చి ఆఖరులోపు రాష్ట్రంలోని ఆరు ప్రాజెక్టుల్నీ పూర్తి చేసి ప్రారంభించాలని ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుల పూర్తికి రూ.1,078 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి చేయొచ్చని భావించింది. అయితే సాంకేతిక, వాతావరణ అంశాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరుకు పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల పనుల పూర్తి సెప్టెంబరుకు వాయిదా పడ్డాయి. నెల్లూరు సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్‌, వెలిగొండ టన్నెల్‌ా2 హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు వెలిగొండ మొదటి టన్నెల్‌ నుంచి నీరు ఇవ్వడం వంటి లక్ష్యాలు విధించుకున్నారు. దీంతో పాటు వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార రెండో భాగం రెండో దశ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో చేపట్టిన 54 ప్రాజెక్టుల పూర్తికి రూ.24,092 కోట్లు కావాలని జలవనరుల శాఖ కిందటి ఏడాది లెక్కలు తేల్చింది. కొత్త ప్రభుత్వ హయాంలో వీటి ప్రాధాన్యాలు తేల్చి ఆ ప్రకారం 2024కు ఏ ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయాలో విభజించారు. ప్రాధాన్యాల వారీ మూడు విభాగాలు చేశారు. రూ.1,078 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఆరు ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మూడు విభాగాల్లోకి రాని మరో 12 ప్రాజెక్టుల్ని ఇతర కేటగిరీల్లో చేర్చారు. వీటి పూర్తికి ఏడాదికి ఎన్ని నిధులు కావాలో పక్కా లెక్కలు వేశారు. వెలిగొండ మొదటి టన్నెల్‌ తవ్వకం పనులే పూర్తయ్యాయి. మిగిలిన పనుల పూర్తికి కొత్త గడువును నిర్ధేశించుకోవాల్సి వచ్చింది. అవుకు టన్నెల్‌లో 180 మీటర్లకు పైగా ఫాల్తు జోన్‌ ఉంది. ఫాల్తు జోన్‌ లేని చోట కాంక్రీటు లైనింగు, టన్నెల్‌ తవ్వకం చేయాలి. అన్నీ కలిపి 16,310 క్యూబిక్‌ మీటర్ల మేర పని చేయాల్సి ఉండగా, 11 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా పెండింగులోనే ఉంది. సాంకేతిక అంశాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. వెలిగొండ మొదటి టన్నెల్‌ నుంచి తాజా లక్ష్యం మేరకు 2021 సెప్టెంబరులో నీరు విడుదల చేయాలి. మొదటి టన్నెల్‌ తవ్వకం దాదాపు పూర్తయినా హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తికాలేదు. వేగం పుంజుకోవాల్సి ఉంది. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులకు సంబంధించి ఆకృతులు ఖరారు కాలేదు. 9 హెక్టార్లకు పైగా అటవీ భూమి వినియోగానికి అనుమతులు రావాల్సి ఉంది. మొదటి టన్నెల్‌ దాదాపు పూర్తయినా రూ.140 కోట్ల విలువైన అనుబంధ పనులు ఫీడర్‌ కాలువ, తీగలేరు కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు, టన్నెల్‌ లైనింగు పనులు పూర్తికాని పరిస్థితి. నెల్లూరు సంగం బ్యారేజీ పనులూ 84 శాతం వద్దే నిలిచిపోయాయి. సంగం బ్యారేజీని జులై 31 పూర్తి చేస్తామని తాజా గడువు పెట్టుకున్నారు. వంశధార-నాగావళి నదుల్ని అనుసంధానించే ప్రాజెక్టులో భాగంగా హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్టకు కాలువ తవ్వకం చేపట్టారు. 33 కిలోమీటర్ల కాలువలో 8.58 కిలోమీటర్ల తవ్వకం కాలేదు. కాలువపై 38 కట్టడాల నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్న పరిస్థితి ఉంది. తోటపల్లి బ్యారేజీకి సంబంధించిన భూసేకరణ సమస్య తీరినా పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనులే నత్తనడకన నడుస్తుంటే మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

Related Posts