
వాషింగ్టన్ జూలై 7
టారిఫ్ల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ సదస్సు వేళ కీలక హెచ్చరికలు చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రూత్లో పోస్టు పెట్టారు. ‘అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బ్రిక్స్ అనుకూలంగా ఉన్న ఏదేశానికైనా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’ అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ట్రంప్ నుంచి ఈ హెచ్చిరకలు రావడం సంచలనంగా మారింది. బ్రెజిల్లోని రియో డీ జెనీరలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్ర దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు విడుదల చేశాయి. ‘ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని ఖండిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నాయి. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్థాన్ పేరు ప్రస్థావించలేదు.