
బ్రెజిల్ జూలై 7
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పొరుగుదేశం పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమన్నారు. ‘పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తోంది. భారత్ మాత్రం ఉగ్రవాద బాధితురాలిగా ఉంది. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మౌనంగా మద్దతు ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన బ్రిక్స్..
బ్రెజిల్లోని రియో డీ జెనీరలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్ర దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు విడుదల చేశాయి.‘ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని ఖండిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నాయి. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్థాన్ పేరు ప్రస్థావించలేదు