హైదరాబాద్, జూన్ 10,
ఈటల రాజేందర్ విషయంలో మొదటి నుంచి కేసీఆర్ చాలా పక్కాగా ముందుకెళ్తున్నారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనుండటంతో.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్కు జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని.. ఆ రకంగా ఆయనకు చెక్ చెప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడే హుజూరాబాద్పై పలువురు మంత్రులు ఫోకస్ చేశారని.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈటల రాజేందర్తో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్కు చెక్ చెప్పడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టు అవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించగలిగితే.. ఈటల రాజేందర్పై పైచేయి సాధించడంతో పాటు బీజేపీపై కూడా అప్పర్ హ్యాండ్ అవుతుందనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. అక్కడ ఫలితం మాత్రం కచ్చితంగా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే విధంగా ముందుగానే గ్రౌండ్ వర్క్ చేయాలని టీఆర్ఎస్ నేతలను, మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.హుజూరాబాద్లో ఇప్పటికే పలు పర్యాయాలు విజయం సాధించిన ఈటల రాజేందర్ను అంత తేలిగ్గా తీసుకోవద్దని డిసైడయిన టీఆర్ఎస్.. అక్కడి ద్వితీయ శ్రేణి నేతలతో పాటు మండల, గ్రామస్థాయి టీఆర్ఎస్ నేతలు పార్టీ వీడకుండా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగలు కమలాకర్తో పాటు మంత్రి హరీశ్ రావు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మాజీమంత్రి ఈటల రాజేందర్కు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.ఈటలపై ఎవరిని పడితే వారిని మాట్లాడనివ్వకుండా కేవలం కొందరికే ఆ బాధ్యత ఇస్తున్నారు. ఇక ఈటలకు పార్టీలో ఉన్న సన్నిహితులతోనే వైరం పెడుతున్నారు. అందులో భాగంగానే హరీశ్రావును రంగంలోకి దింపారు గులాబీ బాస్. ఈటలకు ఎవరూ మద్దతు ఇవ్వకుండా చూసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు కేసీఆర్.ఇక ఎప్పటికైనా ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడైన హరీశ్రావు మద్దతుగా నిలబడే ఛాన్స్ ఉందని పసిగట్టారు కేసీఆర్. అందుకే హుజూరాబాద్ రాజకీయాల్లో ఈటలకు ఆయన్నే ప్రత్యర్థిగా ఉంచి మరీ ఇద్దరి మధ్య వైరం పెంచుతున్నారు. ఈ కారణంగా ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఇప్పుడున్న హుజూరాబాద్ రాజకీయ పరిస్థితులు గమనిస్తే కేసీఆర్ ప్లాన్ బాగానే సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ హరీశ్రావు అన్నట్టు పరిస్థితులు మారాయి. ఈటల రాజేందర్ దమ్ముంటే తనమీద గెలవాలని హరీశ్రావుకు డైరెక్టుగానే చాలెంజ్ చేస్తున్నారు. హరీశ్రావుపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. అటు ట్రబుల్ షూటర్ హరీశ్రావు కూడా ఈటల గట్టిగానే కౌంటర్ వేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్లాన్ బాగానే పనిచేసింది