YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

భూముల అమ్మకం కోసం అడుగులు

భూముల అమ్మకం కోసం అడుగులు

హైదరాబాద్, జూన్ 12, 
రాష్ట్ర అవసరాల కోసం నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి సంబంధించిన ప్రయత్నాలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించగా.. కేబినెట్ నిర్ణయం మేరకు వివిధ శాఖల వద్ద ఖాళీగా లేదా నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా ఖరారు చేసింది.వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూములను అమ్మే క్రమంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ల్యాండ్స్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. భూముల విక్రయ అనుమతుల కోసం అప్రూవల్‌ కమిటీ, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్‌ (వేలం) కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నోడల్‌ శాఖ భూమి ధరను నిర్ణయించి ఈ-వేలం ప్రక్రియ ద్వారా పారదర్శకంగా విక్రయించనున్నారు. సీఎస్ అధ్యక్షతన ఏర్పాటైన స్టీరింగ్‌ కమిటీ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక, పురపాలక, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటున్నారు.భూములు కొనుగోలు చేసిన వారు ఎలాంటి నిర్మాణాలైన చేపట్టేందుకు వీలుగా ఆ భూములను మల్టీపర్పస్‌ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇతర భవన నిర్మాణ అనుమతులన్నీ నిబంధనల ప్రకారం సత్వరం మంజూరయ్యే విధంగా టీఎస్‌ బీపాస్‌ విధానం ద్వారా సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts