
బీజింగ్, జూలై 13,
చైనీస్ బిలియనీర్ల సంపద గత కొన్ని నెలల నుంచి తగ్గిపోతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్, టెక్ కంపెనీల ఓనర్లకు చైనా ప్రభుత్వం నుంచి గట్టి దెబ్బ తగులుతోంది. ఈ దేశంలో కంపెనీల పవర్ మరింత పెరుగుతోందని గుర్తించిన జిన్పింగ్ ప్రభుత్వం వీటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. అలీబాబా, యాంట్ ఫైనాన్షియల్, టెన్సంట్, తాజాగా దీదీ గ్లోబల్ వంటి కంపెనీలపై స్క్రూటినీ పెంచిన ప్రభుత్వం, వీటిని కంట్రోల్లో ఉంచేందుకు రెగ్యులేషన్స్ను కఠినం చేస్తోంది. ప్రభుత్వంలో చైనీస్ బిలియనీర్ల ప్రమేయాన్ని తగ్గించాలని చూస్తోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల సంపద సుమారు 209 బిలియన్ డాలర్లు పెరిగింది. కానీ, ఇదే టైమ్లో చైనీస్ బిలియనీర్ల సంపద 16 బిలియన్ డాలర్లు తగ్గింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో వీరి ర్యాంకులు కిందకి పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్క్రుటినీ పెరగడంతో వీరి కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. చైనీస్ బ్రాడ్ మార్కెట్ పెరుగుతున్నప్పటికీ, కొంత మంది చైనీస్ బిలియనీర్ల షేర్లు మాత్రం 13 శాతం నష్టపోయాయి. కిందటి నెల 30 న న్యూయార్క్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన క్యాబ్ సర్వీస్ కంపెనీ దీదీ షేర్లు ఒకే రోజులో 14 శాతం పడిపోయాయి. యాప్ స్టోర్ నుంచి దీదీని చైనీస్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కస్టమర్ల పర్సనల్ డేటాను సేకరించి, చట్టానికి విరుద్ధంగా ఈ కంపెనీ వాడుతోందని చైనీస్ ప్రభుత్వం పేర్కొంది. కిందటేడాది జాక్ మా కు చెందిన యాంట్ గ్రూప్ ఐపీఓను చైనీస్ ప్రభుత్వం ఆపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచే బిలియనీర్లపై చైనీస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టడం మరింత పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ వరకు పెద్ద కంపెనీలు ప్రజల డేటాను పెద్ద మొత్తంలో సేకరిస్తున్నాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఈ డేటాను విదేశాలకు చేరవేస్తాయని జిన్పింగ్ ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా విదేశీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాలంటే మొదట సైబర్ సెక్యూరిటీ రివ్యూను పూర్తి చేయాల్సి ఉంటుందని చైనీస్ ప్రభుత్వం ఓ డ్రాఫ్ట్ను కూడా తీసుకొచ్చింది. చైనీస్ ప్రభుత్వం కొన్ని అంశాలపై ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. టెక్ ఇండస్ట్రీలో యాంటికాంపిటేటివ్ (కాంపిటేషన్ లేకుండా చేయడం), కొన్ని లెండింగ్ యాప్లపై తక్కువ రెగ్యులేషన్స్ ఉండడంతో ఫైనాన్షియల్ స్టెబిలిటీకి గండి పడడం, పెద్ద కంపెనీలు సెన్సిటివ్ డేటాను విపరీతంగా సేకరించడం వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీటికి తోడు చైనాలో పెద్ద కంపెనీల ఇన్ఫ్లూయెన్స్ ఎక్కువవుతుండడంతో అక్కడి రాజకీయాల్లో వీరి పాత్రను తగ్గించాలని కూడా చైనీస్ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. సౌత్ కొరియా గవర్నమెంట్లో అక్కడి బిలియనీర్ల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని చైనీస్ గవర్నమెంట్ చూస్తోంది. గత కొంత కాలంగా చూస్తే చైనీస్ రాజకీయ పార్టీలలో బిలియనీర్ల పాత్ర తగ్గుతోంది. హురున్ రిపోర్ట్ ప్రకారం, చైనీస్ పీపుల్స్ పొలిటకల్ కాన్ఫెరెన్స్, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లలో బిలియనీర్ల సంఖ్య 5.8 శాతంగా ఉంది. గత ఎనిమిదేళ్లలో ఇదే తక్కువని ఈ రిపోర్ట్ పేర్కొంది. 2013 లో ఈ పార్టీలలో బిలియనీర్ల సంఖ్య 15.3 శాతంగా ఉంది. ప్రభుత్వ దెబ్బకు ఈ కామర్స్ కంపెనీ పిండ్యుడ్యు చైర్మన్ కొలిన్ హాంగ్ తన పదవి నుంచి తప్పుకున్నారు. బిలియన్ డాలర్ల విలువైన షేర్లను డొనేట్ చేశారు. బైట్ డ్యాన్స్ ఫౌండర్ జాంగ్ యిమింగ్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తన టైమ్ను ఎడ్యుకేషనల్ ఛారిటీకి కేటాయిస్తానని చెప్పారు. మైటున్ చైర్మన్ వాంగ్ జింగ్ రీసెంట్గా ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారుల నుంచి వార్నింగ్ రావడంతో సైలెంట్గా ఉన్నారు.ఈ చర్యలన్ని చైనాకు లాంగ్ టెర్మ్లో పెద్దగా సాయపడవని ఎనలిస్టులు చెబుతున్నారు. రెగ్యులేషన్స్ పెరిగితే ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని, వీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారని అంటున్నారు. విదేశాల్లో చైనీస్ కంపెనీలు లిస్టింగ్ కావడాన్ని చైనా ప్రభుత్వం ఆపితే గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టులు ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని చెబుతున్నారు. ఒక విధంగా ఇది ఇండియాకు మేలు చేస్తుంది. చైనా నుంచి బయటకొచ్చే ఇన్వెస్ట్మెంట్లను ఇండియా ఆకర్షించగలిగితే దేశ ఎకానమీ డెవలప్ అవుతుంది