న్యూ ఢిల్లీ జూలై 14
పాకిస్తాన్లో ఉగ్రవాదులు చైనా ఇంజనీర్లు, పాకిస్తాన్ సైనికులతో వెళుతున్న బస్సు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర పాకిస్తాన్లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దాసు ఆనకట్ట నిర్మాణ పనుల నిమిత్తం దాదాపు 30 మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు బస్సులో వెళ్తుండగా ఉగ్రవాదుల ఐఈడీ పేలుళ్ల ధాటికి బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చైనా ఇంజినీర్లు, ఇద్దరు పారామిలటరీ సిబ్బంది, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సులో బాంబులు అమర్చారా? లేక రోడ్డు పక్కన అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఒక చైనా ఇంజినీర్, మరో సైనికుడు తప్పిపోయారు. వీరి ఆచూకీ కోసం బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. పలువురు తీవ్రంగా గాయపడగా, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. మెరుగైన వైద్యం అందించే నిమిత్తం తీవ్రంగా గాయపడిని వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని తరలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.