YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

లావుణీ పట్టాల లెక్కలు సంగతేంటీ

లావుణీ పట్టాల లెక్కలు సంగతేంటీ

నల్గొండ, జూలై 19, 
నివేశన స్థలాలకు, వ్యవసాయం కోసం కానీ ప్రభుత్వ భూమి కేటాయించినప్పుడు నిబంధనలు అమలు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటీ.? రూ.కోట్ల విలువ చేసే భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నా పట్టించుకోకపోవడానికి గల కారణాలేంటీ అన్నదే ఇప్పుడు అంతు చిక్కకుండా తయారైంది.సాధారణంగా ప్రభుత్వం నిరుపేదలను ఆదుకునేందుకు గృహ అవసరాలకు, వ్యవసాయం చేసుకునేందుకు భూములను కేటాయిస్తుంది. ఈ భూములను ‘లావుణీ పట్టాల’ పేరిట కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, వాస్తవంగా ఇందుకు రెవెన్యూ డివిజన్ స్థాయిలో అసైన్‌మెంట్ కమిటీ ఉంటుంది. ఎమ్మెల్యే, ఛైర్మన్, ఆర్డీఓ కన్వీనర్‌గా ఏర్పడే కమిటీలో ఖచ్చితంగా తీర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రొసిండింగ్స్ కూడా తీయడంతో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా రికార్డులను భద్రపర్చాల్సి ఉంటుంది. అయితే, ఈ నివేశన స్థలంలో మూడు నెలల్లో ఇళ్లు నిర్మించుకోనట్టయితే తిరిగి ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వీలు ఉంటుంది. వ్యవసాయ కోసం కేటాయించిన భూమిలో సాగు చేసుకోనట్టయితే అట్టి భూమిని కూడా రెవెన్యూ అధికారులు చట్టప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలే లేవని స్పష్టం అవుతోంది. దశాబ్దలుగా వ్యవసాయ భూముల్లో పంటలు వేసుకోకున్నప్పటికీ కొంతమంది పేర్లలో కేటాయించిన భూమిని వారి పేరిటనే కొనసాగించడం విస్మయానికి గురిచేస్తోంది.ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు అటు రెవెన్యూలో ఇటు గ్రామ పంచాయతీల్లో, మరో వైపున ట్రాన్స్ కోలో స్పష్టంగా కనిపిస్తోంది. లావుణీ పట్టా పేపర్ చూపించి ఇళ్లు కట్టుకుంటున్న వారి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయా లేదా అన్నది మాత్రం అంతుచిక్కకుండా తయారైంది. కొన్ని చోట్ల ఎమ్మార్వో కార్యాలయాల్లో రికార్డులు అందుబాటులో లేనట్టయితే ఆర్డీఓ ఆఫీసుల్లో ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ స్థలాల్లో కడుతున్న భవనాలను పరిశీలిస్తే నిరుపేదలు ఎవరూ కూడా లేరని స్పష్టం అవుతోంది. భూములు ఉన్న వారు, ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించుకుంటున్నారు. అంటే ప్రభుత్వ లక్ష్యం నీరు గారిపోతోందన్నది వాస్తవం. నిరుపేదలకు బాసటగా నిలవాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహరిస్తుండటమే విస్మయానికి గురిచేస్తోంది.ఇక్కడ మరో దందా కూడా కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అగ్రికల్చర్ కోసం అలాట్ చేసిన భూముల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టడం కూడా నిబంధనలకు విరుద్ధమే. ప్రభుత్వం కేటాయించిన ఈ భూముల్లో కేవలం పంటలు సాగు చేసుకుని ఉపాధి పొందాల్సిందే తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా రెవెన్యూ చట్టాలకు పని చెప్పి వాటిని స్వాధీనం చేసుకోవల్సిన బాధ్యత కూడా ఉంది. వ్యవసాయం కోసం కేటాయించిన భూమిని ప్లాట్లుగా చేసుకుని విక్రయించే అధికారం కూడా పట్టాదారుకు ఉండదని నిబంధనలు చెప్తున్నాయి. కానీ, భూపాలపల్లి జిల్లాలోని నాలుగు మండలాల్లో మాత్రం ఇలాంటి నిబంధనలు అమలు చేసే వారు కూడా లేకుండా పోయారు. ఈ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి కూడా వెళ్లడంతో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్కోచోట గుంటకు రూ. 25 లక్షల వరకూ ధర పలుకుతుండటం గమనార్హం.ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మిస్తున్న భవనాలకు కొన్ని చోట్ల పంచాయతీల అనుమతి లేకుండానే భవనాలు నిర్మించడమే ఓ తప్పిదం అయితే, వాటికి ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం విచిత్రంగా ఉంది. ఇంటి పర్మిషన్ లేకున్నా ట్రాన్స్ కో అధికారులు ఇస్తున్నారా..? లేక, సంబంధిత కార్యదర్శులచే తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకుని ప్రొడ్యూస్ చేస్తే విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఒక శాఖ చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇతర శాఖలు కూడా ఇందులో భాగస్వాములుగా మారుతుండటం ఇక్కడ విచిత్రమనే చెప్పాలి.రానున్న కాలంలో సింగరేణి గనులు కూడా ఈ ప్రాంతం మీదుగా విస్తరిస్తుండటంతో రానున్న కాలంలో అక్కడ ప్రభుత్వ భూమి దొరకడం అత్యంత కష్టమేనని చెప్పాలి. ఇప్పుడు ఉన్న భూములను కాపాడుకుంటేనే ప్రభుత్వానికి భవిష్యత్తులో అన్ని విధాలా లాభం ఉంటుదన్న విషయాన్ని విస్మరిస్తుండటం విడ్డూరం.

Related Posts