YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వామ్మో..ఒకటో తారిఖు

  వామ్మో..ఒకటో తారిఖు

విజయవాడ, జూలై 24, 
అమ్మో... ఒకటో తారీఖా... వారం రోజులే ఉంది.. నిజానికి ఒకటవ తేదీ అంటే మధ్యతరగతి వర్గాలకు బెంబేలే. అలాగే బడుగు వర్గాలు కూడా ఆ డేట్ ని చూసి తెగ జడుసుకుంటాయి. నెలలో ఏ డేట్ కీ లేని ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. మొత్తం నెల భారాన్ని అంతా ఈ ఒక్కరోజే మోస్తుంది. కొత్త భారాన్ని కూడా తెస్తుంది. అందుకే ఎవరైనా తలచుకుని మరీ వణికేది ఈ డేట్ ని చూసే. ఇపుడు ఇలాంటి బెంగా , కంగారూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కూడా పట్టుకుంది అంటున్నారు. సెటైరికల్ గా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నా వాస్తవం చూస్తే మాత్రం అదే అంటున్నారు. జగన్ ఫస్ట్ వస్తోంది అంటే ఇబ్బందిగానే ఉంటోందిట. ఎపుడూ కటకటలాడే పరిస్థితే ఏపీది. జగన్ విషయం తీసుకుంటే ఆయన అధికారం చేపట్టి దాదాపుగా 26 నెలలు దాటింది. మొదట్లో జగన్ కి ఏపీ ఆర్ధిక పరిస్థితి పెద్దగా తెలిసేది కాదు, పైగా కొత్త ఉత్సాహం, దాంతో చేతికి ఎముక లేనట్లుగా పధకల పేరిట పంచుకుంటూ పోయారు. అంతే కరోనా మహమ్మారి ఎంటరై మొత్తం సీన్ రివర్స్ చేసి పారేసింది. ఆ తరువాత సెకండ్ వేవ్ కూడా వచ్చేసింది. దాంతో అసలే చితికి ఉన్న ఏపీ మరింతగా కునారిల్లిపోయింది. ఇక సీన్ చూస్తే ప్రతీ రోజూ కటకటగానే ఉంది. అక్షయ పాత్ర తెచ్చినా కూడా ఏపీ ఖజానాను ఎవరూ నింపలేని స్థితి ఉంది అంటున్నారు. ఏపీలో ప్రతీ నెలా ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షనర్ల పెన్షన్లు వంటి వాటికే భారీ మొత్తాలు తీయాల్సి ఉంటుంది. ఇలా కనుక చూసుకుంటే కచ్చితంగా పది వేల కోట్ల దాకా ఫస్ట్ కి ఖర్చుకు డబ్బు అవసరం పడుతుంది. మరి వేయి కోట్లకే అప్పుల కోసం పరిగెత్తే సీన్ ఏపీలో ఉందిపుడు. అలాంటిది ఒకేసారి పదివేల కోట్లు ఖర్చు అంటే భరించడమే కష్టం. అలా ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అందుకే క్యాలండర్ లో రోజులను చూసుకుంటూ వైసీపీ అదినేత జగన్ నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు అంటున్నారు. జగన్ ముందూ వెనకా చూడకుండా హామీలు ఇచ్చేశారు. సరే వాటిని నెమ్మదిగా క్రమ పద్ధతిలో నెరవేరిస్తే బాగానే ఉండేది. కానీ హడావుడిగా ఒక్కో దాన్ని అమలు చేస్తూ పోయారు. ఇపుడు వాటిని ఆపలేరు. అలాగని కొత్తగా రూపాయి పుట్టదు, ఇక సర్కార్ ఉద్యోగులకు జీతాలు ఆపుతూంటే చెడ్డపేరు వస్తోంది. ఇక పదవీవిరమణ చేసి పెన్షన్ రాళ్ళ మీద బతికేవారికి వాయిదా వేస్తే అంతకంటే అపకీర్తి ఉండదు. మొత్తానికి చూసుకుంటే ఫస్ట్ రావడంతోనే ఖర్చులు అలా తన్నుకు వస్తూంటే బడ్జెట్ పద్మనాభంలా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సతమతమవుతున్నారు. ఇక జగన్ కి సైతం ఇది తలకు మించిన భారమే అవుతుంది. తిప్పి తిప్పి చూస్తే ఇంకా ఇంటర్వెల్ కే సినిమా వచ్చింది. మొత్తం అయిదేళ్ళూ పూర్తి అయ్యేసరికి తలకు మించిన భారమా. ఏపీని ముంచే రుణ భారమా అన్నదే తేలాల్సి ఉంది
ఏజీ అక్షింతలు..
రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయంలో ప్రధానంగా రెండు పద్దులు ఉంటాయి. అవి రెవెన్యూ వ్యయం, పెట్టుబడి వ్యయం. చేసే ఖర్చులు ఆధారంగా ఈ పద్దులను ఖరారు చేస్తారు. ఇందులో తక్కువగా నిధులు కేటాయింపులు జరుగుతున్నప్పటికీ... పెట్టుబడి వ్యయానికే అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ వ్యయం వల్ల సంపద సృష్టి ఉంటుందని, ఇది రాష్ట్రానికి, దేశానికి మేలు చేస్తుందని ఆర్ధిక నిపుణులు చెబుతారు. అయితే ఈ ఒక్క కారణాన్ని చూపిస్తూ రెవెన్యూ వ్యయాన్ని కూడా పెట్టుబడి వ్యయంగా చూపించడం రాష్ట్ర ఆర్ధికశాఖకే చెల్లింది. దీనిని అక్కౌంటెంట్ జనరల్ కూడా ఆక్షేపించడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఇదే వ్యవహారం వెలుగుచూసింది. లబ్దిదారులకు ఇచ్చే ఉచిత ఇళ్లు, మరికొంత బ్యాంకు రుణాలతో ఇచ్చే గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని కూడా పెట్టుబడి వ్యయంగా చూపించారు. సంక్షేమ రంగానికి చెందిన ఈ ఖర్చు కేవలం రెవెన్యూ వ్యయం కిందకే వస్తుంది తప్ప పెట్టుబడి వ్యయంగా లెక్కించలేమని అక్కౌంటెంట్ జనరల్ అభిప్రాయపడడం గమనార్హం. ఇదే సమయంలో పెట్టుబడి వ్యయంగా ఉండాల్సిన ఫర్నిచర్, వాహనాలువంటివి రెవెన్యూ వ్యయంలో చూపించడాన్ని కూడా ఎజి కార్యాలయం ప్రశ్నించింది. 2021-22 వార్షిక బడ్జెట్లో వైఎస్ఆర్ గృహవసతికి కేటాయించిన నిధుల్లో 1,096 కోట్లను పెట్టుబడి వ్యయంగా చూపిరచారు. ఇవి పేదలకు ప్రభుత్వం కల్పించే సంక్షేమం మాత్రమే కావడం వల్ల ఈ నిధులను పెట్టుబడి వ్యయంగా చూపించేందుకు ఆస్కారం లేదని ఇతర అధికారులు కూడా అంటున్నారు.

Related Posts