YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మండుతున్న ధరలు...

మండుతున్న ధరలు...

నల్గొండ, జూలై 24, 
ఓవైపు అన్‌సీజన్‌..ఇంకో వైపు కరోనా ఎఫెక్ట్‌..వెరసి హౌల్‌ సేల్‌ మార్కెట్‌లోనే కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో హడలెత్తిస్తున్నాయి. టమాట రేటు సెన్సెక్స్‌ సూచీగా పైపైకి పరుగులు తీస్తున్నది. పచ్చిమిర్చి రేటు సెంచరీకి చేరువై ఘాటెక్కిస్తున్నది. చిక్కుడుకాయ చిన్నబుచ్చుకునేలా చేస్తున్నది. తీగ ఎగబాకినట్టు బీరకాయ రేటు అందకుండా పోయింది. మిగతా కూరగాయదీ తామేం తక్కువ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో కొంతలో కొంత అందుబాటులో ఉన్న ఆకుకూరలు, ఉల్లిగడ్డ, కోడిగుడ్లతో సామాన్యులు పూట గడిపేస్తున్నారు. మహిళామణులైతే రోజూ పొద్దున్నే లేచి ఏం కూర చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. టమాట ధర రోజురోజుకీ అమాంతంగా పెరిగిపోతున్నది. హౌల్‌సేల్‌లో 25 కేజీల టమాట బాక్స్‌ 1200 నుంచి 1300 పలుకుతున్నది. అంటే హౌల్‌సేల్‌లో కిలో టమాట సగటున రూ.50 పలుకుతున్నది. అదే టమాట రెండు, మూడు చేతులు మారి బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి 65 రూపాయల నుంచి 80 రూపాయలు అమ్ముడవుతున్నది. దీనికంతటికీ అన్‌సీజన్‌, కరోనా ఎఫెక్ట్‌ అని తెలుస్తున్నది. గతేడాది ఇదే సీజన్‌లో హైదరాబాద్‌ మార్కెట్‌కు వచ్చే టమాట దిగుబడి సగానికి పడిపోయిందనీ, ప్రస్తుతం రోజూ 50 నుంచి 60 లారీలే వస్తున్నదని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌ తదితర ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, ఏపీ రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతున్నది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో అక్కడ నుంచి టమాట రావడం తగ్గింది. అసలు మార్కెట్‌లో బెంగుళూరు టమాటే కనిపించడం లేదు. మిగతా కూరగాయల రేట్లు కూడా టమాట ధరతో పోటీపడి మరీ పెరుగుతున్నాయి. హౌల్‌సేల్‌ మార్కెట్‌లో 40 కేజీల మిర్చీ బస్తా ధర 2600 పలుకుతున్నది. అంటే హౌల్‌సేల్‌లోనే కిలో రూ.65 ఉంది. అది బహిరంగ మార్కెట్‌లో కాస్తా ఆయా ప్రాంతాలను బట్టి రూ.80 నుంచి 95 వరకు ఉంటున్నది. చిక్కుడుకాయ, బహిరంగ మార్కెట్‌లో కిలో బీరకాయ రూ.70 నుంచి 80 అమ్ముడుపోతున్నది. ఏ కూరగాయలు చూసినా కిలోకు 30 రూపాయలకు కింద ఒక్కటంటే ఒక్కటీ లేవు. కాస్తలో కాస్తంత ఉల్లిగడ్డ మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నది. నాణ్యత, సైజును బట్టి వంద రూపాయలకు పది కేజీల నుంచి ఆరు కేజీలు ఇస్తున్నారు. కూరగాయల రేట్లు పెరగటంతో ఆకుకూరలకూ డిమాండ్‌ పెరిగింది. నెల కింద పది రూపాయలకు ఐదారు ఆకుకూరల కట్టలు ఇస్తే ప్రస్తుతం మూడుకు మించి ఇవ్వట్లేదు. గతంలో వారాంతాల్లో తప్ప పెద్దగా పూదీనా అమ్ముడుపోయేది కాదు. కరోనా ఎఫెక్టుతో పూదీనా, నిమ్మకాయ రసం తాగడం పెరిగింది. దీంతో పూదీనాకు డిమాండ్‌ పెరిగి కట్ట పదిరూపాయలకు చేరింది. గతంలో ఐదురూపాయలకే ఇచ్చేవారు.కూరగాయల రేట్లు పెరిగిపోవడంతో కోడిగుడ్ల వాడకం పెరిగింది. ఒకరోజు కూరగాయలకు పెట్టే ఖర్చును పెడితే 30 గుడ్ల ట్రే వస్తున్నది. హౌల్‌సేల్‌ మార్కెట్‌లో 30 గుడ్ల ధర ఏరియాను బట్టి వంద రూపాయల నుంచి రూ. 115 వరకు పలుకుతున్నది. దీంతో ఒక్కో ఇంట్లో నెలకు రెండు నుంచి మూడు ట్రేలు వాడుతున్నారు. ఉల్లిగడ్డ కోడిగుడ్డు, పప్పుచారు, ఉల్లిగడ్డ పప్పు, ఆకుకూరలు ఎక్కువగా వండుకుంటున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

Related Posts