YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అన్ని జిల్లాలో సర్కారి మెడికల్ కాలేజీలు

అన్ని జిల్లాలో సర్కారి మెడికల్ కాలేజీలు

హైదరాబాద్
ఆర్ధిక శాఖ  మంత్రి హరీష్రావు  సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీష్రావు నేరుగా బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ 2022-223 బడ్జెట్కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య  కళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి,  వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి,  కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో  ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.  2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదించింది.  ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈబడ్జెట్లో వంద కోట్ల రూపాయలను  కేటాయించడం జరిగింది.  ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్ ఛార్జీలను రెట్టింపు (డబుల్) చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. టీ.బి.,క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాలనీ, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయల నుంచి 80 రూపాయలకు పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5కోట్ల రూపాయలను ఖర్చు చేయనుందని మంత్రి అన్నారు.
దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు. గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం రూ. 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు.
 రెండోదశలో ఇతరప్రభుత్వపాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మనఊరు-మనబడి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదనీ, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించిందని హరీష్ రావు వెల్లడించారు.
ఇక  హైదరాబాద్ లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది.   ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తోంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయని అయన వివరించారు.
పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ. 338 కోట్లను ప్రతి సంవత్సరం ఖర్చు చేయనుందని మంత్రి అన్నారు.

Related Posts