
సిద్దిపేట మార్చ్ 23
రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కండ్లు ఉండి.. కండ్లు లేని కబోదుల్లా.. చెవులు ఉండి.. చెవులు లేని చెవిటి వారిలా ప్రతిపక్షాల తీరు ఉందని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు కండ్లు, చెవులు ఉన్న లేనట్టేనని మంత్రి విమర్శించారు.సిద్ధిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్, మహిళా మండలి భవనం, డంపింగ్ యార్డు, ఓపెన్ జిమ్, పల్లె ప్రకృతి వనం, గౌడ సంఘం, శాశ్వత నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో మడి ఎండకుండ రైతులు పంట పండించారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు హైదరాబాద్లో కూర్చోని నీళ్లే రావడం లేదంటున్నారు. నాలుగేళ్లలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ కట్టి గోదారి నీళ్లతో రైతుల కాళ్ళు కడుగుతున్నామని తెలిపారు.మహారాష్ట్రలో 8 గంటల కరెంటే ఇస్తున్నారు. అదీ కూడా గ్యాప్లతో ఇస్తున్నారు. తెలంగాణ బోర్డర్లో మహారాష్ట్ర రైతులు జాగలు కొంటున్నారు. బోర్లు వేసి నీళ్లు తరలించుకుంటున్నారు. ఇది కాదా తెలంగాణ అభివృద్ధి అని హరీశ్రావు ప్రతిపక్షాలను నిలదీశారు. మహారాష్ట్రలో మొన్నటి దాకా బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇదీ వాళ్ల అభివృద్ధి అని మంత్రి దుయ్యబట్టారు.పామ్ ఆయిల్ సాగుతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆ దిశగా రైతులు ఆలోచన చేయాలని సూచించారు. రూ. 100 కోట్లతో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. పామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని చెప్పారు. రూ. 80 వేల కోట్ల పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.పంజాబ్ మాదిరిగానే తెలంగాణలో వడ్లు కొనేదాకా కేంద్రాన్ని వదలబోమని హరీశ్రావు తేల్చిచెప్పారు. వడ్లు కొనుడొక్కటే కేంద్రం పని.. నెహ్రు కాలం నుంచి కొంటున్నారు.. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకుండా.. రైతుల ఉసురు పోసుకుంటున్నది.వడ్లు కొనకపోతే తెలంగాణ ఉద్యమిస్తదని హెచ్చరించారు. తెలంగాణలో ఇంటికో ఉద్యమకారుడు ఉన్నాడు.. మీ మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని తేల్చిచెప్పారు. మద్దతు ధర ఇచ్చి వడ్లు కొనేదాకా వదిలే ప్రసక్తే లేదని హరీశ్రావు స్పష్టం చేశారు.