
సిద్దిపేట
వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం నాడు జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణరావుపేట మండలం దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్లో మంత్రి పర్యటించారు. గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 37 మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, కిచెన్ అండ్ డైనింగ్ షెడ్, సామూహిక పాడి పశువుల వసతి సముదాయాన్ని ప్రారంభించారు. డ్రోన్ ద్వారా పంటలపై పిచికారీ ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. ఫోన్ మెసేజ్,మోబైల్ యాప్ ద్వారా మోటరు ఆపరేట్ చేసే పంప్ రూమ్ ప్రారంభించారు. అనంతరం నాట్కో సహకారంతో మోబైల్ క్లినిక్ను ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ సమిష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అందరి భాగస్వామ్యంతోనే మీ గ్రామానికి గౌరవం వచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజల కృషి ప్రశంసనీయమని అన్నారు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది. గ్రామంలో హెల్త్ సెంటరు ఏర్పాటు చేశాం. 70 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని మంత్రి తెలిపారు.