YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీలో కాంగ్రెసీకరణ

బీజేపీలో కాంగ్రెసీకరణ

హైదరాబాద్, నవంబర్ 21, 
తెలంగాణ బీజేపీ టీఆర్ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున చేరికల కోసం ప్రయత్నించింది. ఫామ్ హౌస్ కేసు కావొచ్చు.. మునుగోడు ఉపఎన్నికల ఎఫెక్ట్ కావొచ్చు.. లేదా బీజేపీకి గ్రామ స్థాయిలో క్యాడర్ లేకపోవడం వల్ల కావొచ్చు.. ఏదైనా కారణం కానీ టీఆర్ఎస్ నుంచి చేరికలు మాత్రం ఆశించినట్లుగా లేవు. దీంతో బీజేపీ వ్యూహం మార్చింది. కాంగ్రెస్ నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించారు. గతంలోనే కొంత మంది చేరారు. రెండో విడతగా మర్రి శశిధర్ రెడ్డితో ప్రారంభించారు. ఇంకా చాలా మంది చేరుతారని ఆయనే చెబుతున్నారు. ఇప్పటి వరకూ చేరిన వారిని చూస్తే.. చేరబోతారని జరుగుతున్న ప్రచారంలో ఉన్న పేర్లను చూస్తే.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ బీజేపీ మొత్తం కాంగ్రెస్సీకరణ అయిపోవడం ఖాయమని అనుకోవచ్చు. దీని వల్ల ఆ పార్టీకి మేలు జరుగుతుందా ? కీడు జరుగుతుందా ?ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కేసీఆర్ వచ్చే మార్చి తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉందని రాజకీయవర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే.. బీజేపీ కూడా కంగారు పడుతోంది. తెలంగాణ బీజేపీలో అగ్రనేతలకు కొదవలేదు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక లక్ష్మణ్ జాతీయ స్థాయి నాయకుడయ్యారు.  కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, వివేక్ , ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. ఇలా చాలా మంది ముఖ్య నేతలు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. అయితే ఇలాంటి నేతల్లో  నియోజకవర్గాల్లో పట్టు  ఉన్నవాళ్లు తక్కువే. రాష్ట్ర నాయకులు.. ఓ పది..పదిహేను నియోజకవర్గాల్లో బలంగా ఉంటారు. మరి మిగతా  నియోజకవర్గాల్లో ఎవరు పార్టీ  బాధ్యత తీసుకుంటారు? . ఇదే ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. నియోజకవర్గం మొత్తాన్ని నడిపించే నాయకుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. తాము పోటీ చేస్తామంటే.. తాము పోటీ చేస్తామని రేసులోకి నియోజకవర్గానికి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు కానీ వారెవరూ పార్టీ బలానికి తమ బలం యాడ్ చేసి సీటును గెలిపించుకువస్తామనే వాళ్లు కాదు. పూర్తిగా పార్టీ మీద ఆదారపడేవారే. అక్కడే అసలు సమస్య వస్తోంది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ బయటపడకపోయి ఉంటే.. టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ఉండేవారు. ఆ తర్వాత ఓ వేవ్ కనిపించేది . పెద్ద ఎత్తున  నేతలు బీజేపీలో చేరి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందలయింది. ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. కానీ  ఇటీవల పార్టీలో చేరిన వారు రివర్స్ అయిపోయారు. దాసోజు శ్రవణ్ , స్వామి గౌడ్ వెళ్లిపోయారు. పార్టీలో నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రం చేరడం లేదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చర్చలు జరిపి..  సుముఖత వ్యక్తం చేసిన తర్వాత కూడా కొందరు వెనుకడుగు వేస్తున్నారు. వారికి సరైన భరోసా లభించకపోవడమే కారణం. ఇప్పుటికిప్పుడు టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వల్ల ఆ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరేందుకు అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి చేరారు. త్వరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరొచ్చు. మర్రి శశిధర్ రెడ్డి చేరుతున్నారు. ఆయన ఇంకా చాలా మందిచేరుతారని అంటున్నారు. బహుశా.. రేవంత్ రెడ్డి నాయకత్వం నచ్చని వారు.. తమకు అవకాశాలు రావని భావించేవారంతా  బీజేపీలో చేరవచ్చు. ఇప్పటికిప్పుడు బీజేపీ ముఖ్య నేతల లెక్క తీస్తే ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కనిపిస్తున్నారు. ముందు ముందు కాంగ్రెస్ నేతలే కనిపించే చాన్స్ ఉంది. ఇది బీజేపీకి మేలు కన్నా కీడే చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బెంగాల్‌లో కూడా  బీజేపీ దాదాపుగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.  ఆ పార్టీ రేసులోకి వచ్చింది కానీ నియోజకవర్గ స్తాయి నేతలు లేరు. దీంతో  తృణమూల్ కాంగ్రెస్ నుంచే పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకుంది. చివరికి వారి సీఎం ఫేస్ అభ్యర్థి కూడా తృణమూల్ నేత. కానీ చివరికి అది ఎదురు తన్నింది. తెలంగాణలో కాంగ్రెస్సీకరణ చేసుకోవడం ద్వారా అదే పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన ఆ పార్టీలో ఇప్పటికే ప్రారంభమయింది. కాంగ్రెస్ నేతల చేరికలను ఆహ్వానించవచ్చు కానీ.. నియోజకవర్గాల్లో పట్టు లేని వాళ్లను.. చేర్చుకోవడం వల్ల అదనపు సమస్య తప్ప ఉపయోగడం ఉండదని అంటున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఏం చేస్తుందో ?

Related Posts