YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. ఎం ఎల్ సి కవితలో పెరిగిన టెన్షన్..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం..      ఎం ఎల్ సి కవితలో పెరిగిన టెన్షన్..?

న్యూ డిల్లీ జూన్ 7
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్రూవర్‌గా మారుతానని శరత్ ముందుకు రావడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఓకే చెప్పేసింది. అయితే.. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారటాన్ని వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సవాల్ చేస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో ఆప్ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే రౌజ్ అవెన్యూ కోర్టులో ఆప్ పిటిషన్ దాఖలు చేయనున్నది. లిక్కర్ కేసుకు సంబంధించి అనేక కీలక అంశాలను ప్రత్యేకించి శరత్ చంద్రారెడ్డికి సంబంధించి గతంలో దర్యాప్తు సంస్థలు ఆయనపై మోపిన అభియోగాలు సహా పలు కీలక అంశాలను పిటీషన్‌లో ప్రస్తావించేందుకు ఆప్ సిద్ధమైంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్‌గానే లిక్కర్ కేసులో పరిణామాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టులో సవాల్ చేయాలని ఆప్ భావిస్తోంది.
కవిత ఏం చేస్తారో..!?
ఈ పరిస్థితుల్లో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఇప్పటికే పలుమార్లు విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏం చేయబోతున్నారన్నది ప్రశ్నార్థంగా మారింది. ఆప్ ఇలా సవాల్‌కు సిద్ధమైన పరిస్థితుల్లో కవితలో టెన్షన్ పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలి..? ఎవరితో చర్చించాలనే విషయాలు తెలియక అయోమయంలో పడినట్లు సమాచారం.
బుధవారం ఉదయం ఈ విషయంపై సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. కవితకు ఎలాంటి ఢోకా అక్కర్లేదని.. బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఈ కేసులో లోపాయికారి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే ఈ మధ్య బీజేపీని కేసీఆర్.. కేసీఆర్‌ను బీజేపీ అస్సలు విమర్శించుకోవట్లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ కేసీఆర్ ప్రసంగం చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
జరిగేది ఇదేనా..!?
కాగా.. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారతానన్న అభ్యర్థనకు ప్రత్యేక కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. అప్రూవర్‌గా మారటానికి ముందే పూర్తిస్థాయి బెయిల్‌తో శరత్ జైలు బయట ఉన్నారు. ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించాలని హోం శాఖ ఆదేశించినట్లు వివరించాయి. శరత్ అప్రూవర్‌గా మారి కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కవిత ప్రేరణతోనే తాను మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని శరత్‌ చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరత్‌ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్‌గా మారితే కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, స్కాంలో కవిత లావాదేవీల సమాచారం ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు ఢిల్లీ పెద్దలకు అనేక సార్లు చెప్పారు. కేసీఆర్‌ కుటుంబాన్ని కేసుల వలయంలో ఇరికిస్తే తప్ప బీఆర్‌ఎస్‌ బలహీనం కాదని, బీజేపీకి అవకాశాలు దక్కవని చెబుతూ వచ్చారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఏదో అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం మొదలు పెట్టారని, కవిత అరెస్టు అయితేనే బీజేపీపై నమ్మకం పెరుగుతుందని ఇటీవలే రాష్ట్ర నేతలు మీడియా ముందు ఊదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఢిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్‌ గ్రూప్‌ తరఫున పాల్గొన్న వారిలో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారస్తుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు గోరంట్ల, శరత్‌ చంద్రారెడ్డి ఉన్న విషయం తెలిసిందే.ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ కేసులో రోజురోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయి. ఆప్ మాత్రం తాడో పేడో తేల్చుకోవడానికి రె‘ఢీ’ అంటోంది. ఇంకా ఆప్ ఎంతవరకూ వెళ్తుందో తెలియట్లేదు. ఈ పరిస్థితుల్లో కవిత ఏం చేస్తారో.. ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తారో అన్నది తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఈ లిక్కర్ కేసులో ఇప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.. ఏం జరుగుతుందో చూడాలి మరి. 

Related Posts