YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైల్వే కౌంటర్లలలో యూపీఐ పేమెంట్స్

రైల్వే కౌంటర్లలలో యూపీఐ పేమెంట్స్

ముంబై, ఫిబ్రవరి 8,
రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. టికెట్‌ కౌంటర్ల దగ్గర డిజిటల్‌ పేమెంట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల కష్టాలతో పాటు టికెట్‌ కౌంటర్ దగ్గర రైల్వే సిబ్బంది పడుతున్న బాధలను అర్థం చేసుకుని... ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఇకపై టికెట్‌ కొనేందుకు చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా టికెట్‌ కొనుక్కోవచ్చు. అంతేకాదు... రైల్వే కౌంటర్లలో డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయొచ్చు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం... మధ్యతరగతి ప్రజలకు ఊరట నిస్తోంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే మధ్యతరగతి వారు ఎంచుకునేది రైలు ప్రయాణమే. అయితే రైలు టికెట్ల బుకింగే కొంచెం కష్టం. ముందస్తు ప్లాన్‌ ఉండి... 20, 30 రోజుల ముందే టికెట్‌ బుక్‌ చేసుకుంటే పర్వాలేదు. లేదంటే చుక్కలే. ఇక టికెట్‌ టికెట్‌ బుకింగ్‌ విషయానికి వస్తే... అవగాహన ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటారు. లేని వాళ్లు... రైల్వేస్టేషన్లలో టికెట్‌ కౌంటర్ల దగ్గరకు వెళ్లి.. టికెట్‌ రిజర్వ్‌ చేయించుకుంటారు. రైల్వే కౌంటర్లకు వెళ్లి... టికెట్‌ బుక్‌చేసుకోవాలంటే... చేతిలో డబ్బులు ఉండి తీరాల్సిందే. టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోతే.. అదో సమస్య. ఇకపై అలాంటి సమస్యలు లేకుండా... సరికొత్త నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. డిజిటల్‌ పేమెంట్స్‌ విధానం ప్రవేశపెట్టి... అటు ప్రయాణికులకు... ఇటు టికెట్‌ కౌంటర్‌లోని సిబ్బందికి కాస్త రిలీఫ్‌ ఇస్తోంది.రైల్వే స్టేషన్‌లోని అన్ని టికెట్‌ కౌంటర్ల వద్ద యూపీఐ పేమెంట్స్‌ చేయవచ్చు. అందుకోసం... టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి యూపీఐ యాప్‌ ద్వారా చెల్లింపులు చేసేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. యూపీఐ యాప్‌ ద్వారా కానీ....  లేదా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులు చేసే వీలు కల్పించింది. ఇందుకోసం.. ఇప్పటికే అన్ని రైల్వే స్టేషన్లలో 466 పీఓఎస్ మిషన్లు, యూపీఐ క్యూఆర్ కోడ్‌లను అమర్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్ సిస్టమ్ కౌంటర్లలో ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిజిటల్ సదుపాయాల్ని బలోపేతం చేయడానికే... రైల్వే టికెట్ కొనుగోలులో నగదు రహిత  విధానాల్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల రైల్వే ప్యాసింజర్ల సమయం ఆదా అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ కోసం గూగుల్ పే, ఫోన్ పే సహా పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్స్ వాడుతున్నారు. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ అనువుగా ఉంటుంది అధికారులు భావిస్తున్నారు. చిల్లర కష్టాలు తీరడమే కాకుండా.... టిక్కెట్టు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనరల్‌ టికెట్‌ కూడా డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా కొనుక్కోవచ్చని... సంబర పడుతున్నారు.

Related Posts