పెద్దపల్లి
పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలని, మాదిగకే పార్లమెంట్ టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ కార్యాలయానికి మాదిగశక్తి నేతలు తరలివెళ్ళారు. ఈ సందర్భంగా మాదిగ శక్తి వ్యవస్థాపకుడు బొంకూరి సురేందర్ సన్ని మాట్లాడుతూ, మాదిగ దండోరా, మాదిగ జేఏసీ, మాదిగశక్తి ఆధ్వర్యంలో జిల్లా నుండి రెండువందల మంది నాయకులు, మహిళలు తరలివెళ్ళినట్లు తెలిపారు. రాష్ట్రంలో 80లక్షల జనాభా కలిగిన మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తూ కేవలం ఓకే కుటుంబానికి చెందిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వడమంటే యావత్తు మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చారని, అలాంటి మాదిగలను నేడు రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని తాడో పేడో తేల్చుకోవడానికి ఢిల్లీకి బయలుదేరామని ఏఐసిసి కార్యాలయం ముందు మాయొక్క గొంతును వినిపిస్తామని తప్ప కుండా అభ్యర్థిని మార్చే వరకు మాపోరాటం ఆగదని బొంకూరి సురేందర్ సన్ని స్పష్టం చేశారు.