YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తీరానికి వాడేసుకుంటున్న కూటమి సర్కార్

తీరానికి వాడేసుకుంటున్న కూటమి సర్కార్

కాకినాడ, ఏప్రిల్ 9, 
ఏపీ సీఎం చంద్రబాబు అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సైతం ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటు కేంద్రం సైతం ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఇప్పటికే దూకుడుగా ఉంది ఏపీ ప్రభుత్వం. కొద్ది నెలల కిందట విశాఖ కేంద్రంగా రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు ఉత్తరాంధ్రలో నేవీకి సంబంధించి యుద్ధ నౌకల కేంద్రంతో పాటు ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు అత్యంత చొరవ తీసుకుంటున్నారు. ఇండియన్ నేవీ కి భూములను కేటాయించి.. ఇక్కడ ఏర్పాటు అయ్యేలా కేంద్రాన్ని ఒప్పిస్తున్నారు.తూర్పు కోస్తాప్రాంతంగా విశాఖకు గుర్తింపు ఉంది. ఇప్పటికే నేవీ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది విశాఖ నగరం. తూర్పు కోస్తా తీర పరిరక్షణకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది మొదలు.. నావీ సేవలను విస్తృత పరుస్తూ వస్తోంది. అందులో భాగంగా దేశానికి అవసరమైన యుద్ధ నౌకల తయారీ కేంద్రం, ఆయుధ డిపోను ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్థలం అవసరం అని కేంద్రం కోరింది. దానికి భూమిని సమకూర్చే పనిలో పడింది చంద్రబాబు సర్కార్. ఈ రెండు ఏర్పాటు అయితే ఏపీకి జాతీయ పరంగా ప్రత్యేక గుర్తింపు దక్కినట్టే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడే అవకాశం ఉంది.ప్రస్తుతం విశాఖ కేంద్రంగా తూర్పు కోస్తా నావికాదళం కొనసాగుతోంది. దేశంలోనే విస్తృత సేవలు అందిస్తోంది ఈ ప్రాంతీయ కార్యాలయం. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబిల్లిలో యుద్ధనౌకల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది నావికాదళం. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీనిపై శరవేగంగా స్పందించింది చంద్రబాబు సర్కార్. అక్కడ భూముల ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాంబిల్లిలో 32 యుద్ధ నౌకలు నిలిపేలా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వమే ఒక పోర్టు ఏర్పాటు చేయనుంది. అదే జరిగితే భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని నావికాదళం అధికారులు చెబుతున్నారు.ఇంకోవైపు విజయనగరం జిల్లా బాడంగిలో నావికాదళానికి సంబంధించి ఆయుధ డిపో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండేది. కాలక్రమంలో అది కనుమరుగయింది. కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ భూములు మాత్రం రైతుల ఆధీనంలో ఉన్నాయి. ఒకవైపు అదే జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం.. ఇంకోవైపు రైల్వే మార్గం.. మరోవైపు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బాడంగిలో నావికాదళం ఆయుధం డిపో ఏర్పాటుకు దేశస్థాయి అధికారులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే చంద్రబాబు సర్కార్ తీర ప్రాంతాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వినియోగించుకుంటోంది.ఇప్పటికే విశాఖను పర్యాటకంగా, పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు చంద్రబాబు సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ఐటీ పరంగా చాలా సంస్థలను ఇక్కడ నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం తమ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాయి. ఒకవైపు పారిశ్రామికం, ఇంకో వైపు ఐటి, మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుతో విశాఖ దేదీప్యమానంగా వెలగనుంది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల సరసన చేరనుంది.

Related Posts