
హైదరాబాద్, ఏప్రిల్ 26,
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన మారణహోమంపై దేశమంతా రగిలిపోతున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ మరో వివాదంలో చిక్కుకుంది. 'గ్లోబల్ జస్టిస్ అందించడమే ప్రధాన లక్ష్యం' అనే ఇతివృత్తంతో హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 26 వరకు "భారత్ సమ్మిట్ 2025" నిర్వహిస్తుండగా.. సుమారు 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్లో.. ఏర్పాటు చేసిన భారతదేశ చిత్ర పటం తప్పుగా ఉండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. భారత సమ్మిట్లో పాల్గొన్న ఫొటోలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేయగా.. ఈ వివాదం చెలరేగింది. రాజగోపాల్ రెడ్డి ఫొటోల్లో దూరంగా ఓ ఇండియా చిత్రం కనిపిస్తుండగా.. అందులో జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా ముద్రించనట్టుగా కనిపిస్తోంది. దీంతో.. ఒక్కసారిగా వివాదం చెలరేగింది. బీజేపీ నేతలే కాకుండా చాలా మంది నెటిజన్లు.. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంతో కాసేపటికే ఆ పోస్ట్ని రాజగోపాల్ రెడ్డి డిలీట్ చేశారు. అయినప్పటికీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోలను స్క్రీన్ షాట్ తీసిన.. బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రచ్చ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి, ప్రజావ్యతిరేక స్వభావాన్ని బహిర్గతం చేసే ఓ క్లాసిక్ ఉదాహరణ అని బీజేపీ నేతలు ఆరోపిస్తూ.. పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అఫీషియల్ ఖాతాలో స్క్రీన్ షాట్లతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు పోస్టు చేశారు. తెలంగాణ ప్రజల పన్నుల నుంచి వచ్చిన ప్రభుత్వ నిధులను వినియోగిస్తూ.. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే ఆహ్వానితులుగా సమ్మిట్ను నిర్వహించారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఇది దేశ ద్రోహం అని బీజేపీ తెలంగాణ అభివర్ణించారు.కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యాప్లో లద్దాఖ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఉద్దేశపూర్వకంగా తొలగించారని బీజేపీ తెలంగాణ మండిపడింది. ఇది ప్రపంచానికి చాలా ప్రమాదకరమైన, నీచమైన సందేశాన్ని పంపుతోందని నిప్పులు చెరిగింది. అంటే ఇవి ఇకపై భారత్లో భాగం కావని వారి ఉద్దేశమంటూ విమర్శించింది. ప్రజల పన్ను డబ్బులతో నిర్వహించిన ఈ కార్యక్రమం మన జవాన్ల త్యాగాలను అవమానించడం మాత్రమే కాకుండా, భారత దేశ సార్వభౌమాధికారాన్ని నేరుగా దెబ్బతీయడంగా బీజేపీ తెలంగాణ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని రెడ్ లైన్స్ దాటి పోయిందని.. ఇది దేశద్రోహ చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ దుయ్యబట్టింది.కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లోనూ ఇదే తరహా వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో భారత దేశ పటాన్ని కశ్మీర్, లేహ్ లేకుండా ముద్రించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బీజేపీ నాయకులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కావాలనే దేశానికి వెన్నుపోటు పొడుస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇప్పుడు తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన కూడా అదే తరహా దేశద్రోహ చర్య అని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.