
హైదరాబాద్, జూలై 7,
తెలంగాణలో 81 గ్రామాలను రూ. 1,273 కోట్లతో సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా మార్చేందుకు రెడ్కో టెండర్లు పిలిచింది. ఇందులో రూ. 400 కోట్లు కేంద్రం, రూ. 873 కోట్లు రాష్ట్రం భరిస్తాయి. 16,840 వ్యవసాయ బోర్లు, 40,349 ఇళ్లకు సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తారు. రైతులు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అందించి యూనిట్కు రూ. 3.13 ఆదాయం పొందవచ్చు. ఈ పథకం విజయవంతమైతే.. గ్రామాల్లో కరెంట్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది.తెలంగాణ వ్యాప్తంగా 81 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలకు మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇళ్ల పైకప్పులు, వ్యవసాయ బోర్లకు, ఇతర విద్యుత్ కనెక్షన్లన్నింటికీ సౌరశక్తిని వినియోగించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు రూ. 1,273 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ కింద సౌర ఫలకాల ఏర్పాటుకు రెడ్కో టెండర్లను ఆహ్వానించింది. మొత్తం వ్యయంలో రూ. 400 కోట్లను కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రాయితీగా అందించనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. జూలై 24లోగా టెండర్లను దాఖలు చేయాలని రెడ్కో సూచించింది.ఈ 81 గ్రామాల్లో 16,840 వ్యవసాయ బోర్లు ఉన్నాయి. ఒక్కో బోరుకు 7.5 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు. సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటును బోరుకు వాడుకున్న తర్వాత మిగిలింది సాధారణ గ్రిడ్కు సరఫరా అవుతుంది. ఈ విధంగా సరఫరా చేసిన విద్యుత్కు గాను బోరు యజమానికి యూనిట్కు రూ. 3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయి. దీనివల్ల రైతలకు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుత అంచనాల ప్రకారం 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 4.50 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇందులో 30 శాతం కేంద్రం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మునంతా రైతుల తరఫున ఈ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లిస్తుంది. ఇది రైతులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ గ్రామాల్లో ఉన్న 40,349 ఇళ్లపై ఒక్కోదానికి 2 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకాలను ఏర్పాటు చేయాలని రెడ్కో మరో టెండర్ పిలిచింది. మొత్తం 80,698 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యంతో ఈ ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.వ్యవసాయ బోర్లు (126.30 మెగావాట్లు), గృహాలు (80.69 మెగావాట్లు) కలిపి మొత్తం 206.99 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకానికి మొత్తం రూ. 1,273 కోట్లు కేటాయించినందున, సగటున ఒక మెగావాట్కు రూ. 6.15 కోట్లు వెచ్చించనున్నారు. భూమి అందుబాటులో ఉంటే మెగావాట్కు రూ. 4 కోట్లలోపే ఖర్చవుతుందని రెడ్కో అంచనా వేస్తున్నప్పటికీ, ఈ గ్రామాల్లో భూసేకరణ లేకుండా బోర్ల వద్ద, ఇళ్లపై సౌరవిద్యుత్ ఏర్పాటుకు ఈ వ్యయం చేయనున్నారు.ఈ పైలట్ పథకం ఈ 81 గ్రామాల్లో విజయవంతమైతే, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని గ్రామాల్లో సౌరవిద్యుత్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కాగా, ఈ సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే ఈ గ్రామాల్లో కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పటికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా..ఇకపై దాని అవసరం కూడా ఉండకపోవచ్చు.