
గుంటూరు, మే 30,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారని అన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అందుకే తాను ఇప్పుడు ఎవరినీ నమ్మడం లేదన్నచంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలే హత్యకు గురవుతుండటం పార్టీ అధినేతకు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే వైసీపీ హయాంలో కంటే తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే టీడీపీ కార్యకర్తలు వరసగా హత్యకు గురి కావడం పట్ల చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు కనపడుతుంది. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్య కేసులోనూ టీడీపీకి చెందిన వారే ఉన్నారని తేలింది. దీంతో పాటు ఒకే సామాజికవర్గానికి చెందిన వారి మధ్య తలెత్తిన విభేదాలు హత్యకు దారి తీశాయి. వీరయ్య చౌదరిని హత్య చేసింది వైసీపీ నేతలంటూ తొలుత ప్రచారం జరిగినా తర్వాత వారంతా టీడీపీలో ఉన్న వారే అని తేలడంతో పార్టీ అధినాయకత్వం అవాక్కయింది. అయితే కేవలం వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరుతోనే ఈ హత్య జరిగిందని తెలిసిన తర్వాత మౌనం వహించక తప్పలేదు. చిన్న వయసులోనే వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడంతో ఆవేదనలో ఉన్న అధినాయకత్వం నియోజకవర్గాల్లో మద్యం, ఇసుక, మైనింగ్ విషయాల్లోనే ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించారు. ఇక ప్రత్యర్థులకు చుక్కలే పల్నాడు జిల్లాలో జంట హత్యలు... ఇక తాజాగా పల్నాడు జిల్లాలోనూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణం టీడీపీ వారేనని తొలుత జిల్లా ఎస్పీ ప్రకటించినప్పటికీ తర్వాత పల్నాడు ప్రాంత వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేశారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు కోవర్టులుగా మారి ప్రత్యర్థి పార్టీల నేతలతో చేతులు కలుపుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నమ్మారు. అందుకే ఈ హత్యల్లో నేరుగా వైసీపీ వారి ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఉందని భావించిన చంద్రబాబు పార్టీలో కోవర్టులున్నారంటూ వారికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తేనే సరిపోతుందా? లేక నేతలకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి కదా? అన్న కామెంట్స్ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.