
న్యూఢిల్లీ, జూన్ 17,
ఇప్పటికే భారత్ నాలుగో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. జపాన్ దేశాన్ని పక్కనపెట్టి.. జర్మనీని అధిగమించి.. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. అదే గనక వాస్తవరూపం దాల్చితే జర్మనీ మన తర్వాతి స్థానంలోకి వెళ్లిపోతుంది. ఎలాగూ మూడో స్థానంలోకి వెళ్తాం కాబట్టి మన ముందు కేవలం డ్రాగన్, అమెరికా దేశాలు మాత్రమే ఉంటాయి. అప్పుడిక ఆ రెండు దేశాలను అధిగమించడానికి మనం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అయితే అన్నీ మంచి శకునములే అన్నట్టుగా.. భారత్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించే విధంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే గనుక వాస్తవరూపం దాల్చితే.. ప్రపంచంలోనే మనం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటాం. చైనాను సైతం పడగొట్టి.. అమెరికాకు సవాల్ విసిరేస్థాయిలో ఉంటాం. ఇంతకీ మన శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు? కేంద్ర మంత్రి ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు? ఇంతకీ అండమాన్ సముద్రంలో ఏముంది? అది వెలికి తీస్తే ఏం జరుగుతుంది? ప్రపంచ గమనాన్ని మార్చుతుంది కేవలం ఒకటే ఒకటి. అదే ముడిచమురు. ఆ చమురు నిల్వలు ఉన్న దేశాలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నాయి. దుబాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య నగరంగా ఏర్పడిందంటే దానికి కారణం చమురు మాత్రమే. ఆ చమురు కోసమే అమెరికా ఇరాన్, ఇరాక్ వంటి దేశాలపై యుద్ధాలు చేసింది. చమరు నిల్వలపై గుత్తాధిపత్యాన్ని సాధించడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరికి ఎంతో కొంత విజయం సాధించింది. ఇక ఉక్రెయిన్ తో ఏళ్ల పాటు యుద్ధం సాగిస్తున్న రష్యా.. ఆర్థికంగా ఇప్పటికీ అదే స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం చమురు మాత్రమే. అందువల్లే చమురు ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తోంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న మనదేశంలో చమురు నిల్వలు అంతంత మాత్రమే. పైగా అవి మన దేశీయ అవసరాలకు సరిపోవు. అందువల్లే విదేశాల నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక మనదేశంలో విస్తారంగా సముద్రాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సముద్రతీరం ఉన్న ప్రధాన ప్రాంతాలలో అండమాన్ ఒకటి. ఈ అండమాన్ సముద్రంలో కొంతకాలంగా మన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు ఇప్పుడు సత్ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అండమాన్ సముద్రంలో దాదాపు 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. వీటిని కనుక వెలికి తీస్తే మన ఎకానమీ 3.7 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మన దేశం ముడిచమురు దిగుమతుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఈ చమురు కోసం భారీగా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేస్తోంది. ఒకవేళ ఈ చమురు గనుక వెలికి తీసినట్టయితే.. అప్పుడు దేశ అవసరాలతో పాటు.. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మన దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుంది. ప్రపంచ దేశాలను అధిగమించి.. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. అన్ని అనుకూలిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.