
హైదరాబాద్, జూన్ 17,
బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. `లీడర్` పేరుతో ఆమె యువతకు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్ర స్తాయిలో యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి ‘లీడర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఇప్పటి వరకు లేని ఈ కార్యక్రమానికి యువత నుంచి మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. అయితే.. ఈ కార్యక్రమం వెనుక చాలా పెద్ద వ్యూహమే కవిత రచించి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఆమె ప్రారంభించారు. అయితే.. త్వరలోనే దీనిని జిల్లాల స్థాయికి కూడా తీసుకువెళ్లనున్నట్టు కవిత చెప్పుకొచ్చారు. ఈ శిక్షణలో భాగంగా ప్రశ్నించే తత్వాన్ని, రాజకీయాలను కూడా యువతకు నేర్పనున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. కేవలం కవిత నేతృత్వంలోని జాగృతి తరఫునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో ఆమె బీఆర్ఎస్ నాయకత్వంపై ఎదురు దాడి చేస్తుండడం.. ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను దేవుడు అనడం.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బీఆర్ఎస్ జెండాను పక్కన పెట్టి జాగృతి పతకాన్ని ధరిస్తుండడం.. కార్యకర్తలు, నాయకులను కలిసినప్పుడు కూడా ఇదే పంథాలో ముందుకు సాగుతుండడం వంటివి ఆమె కొత్త అజెండాకు ఏదో పునాదులు వేస్తున్నారన్న చర్చకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే.. దీనిపై స్పష్టత లేకపోయినా.. ప్రస్తుతం చేపట్టిన `లీడర్` కార్యక్రమం ద్వారా తన సైన్యాన్ని ఆమె స్వయంగా తీర్చిదిద్దుకుంటున్నారన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలా చేయడం ద్వారా కవిత భవితను రూపొందించుకుంటున్నారని కూడా పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇది నిజంగానే ఆమెకు బలాన్ని చేకూరుస్తుందా? లేక.. వ్యూహం ఏంటి? అనేది చూడాలి. ఏదేమైనా.. కవిత ప్రారంభించిన లీడర్ కార్యక్రమం ఏమేరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి.