
గుంటూరు, జూన్ 24,
తప్పా.. తప్పున్నర..! మనం మామూలుగా తప్పు చేసినప్పడు వాళ్లని మందలించడానికి ఉపయోగించే ఓ మాట..! ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఐదు రోజుల కిందట జగన్ మోహనరెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన ఓ దుర్ఘటనకు దీనికి సంబంధం ఉంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహనరెడ్డి వాహనం కింద పడి ఓ వ్యక్తి చనిపోయిన వీడియో ఒకటి తిరుగుతోంది. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ.. వచ్చే వీడియో నిజమా.. అబద్దమా…?అన్న అనుమానాలు జనాలకు వచ్చాయి. అంతకంటే ముందు పోలీసులు మరో వాహనం కింద పడి ఓ వ్యక్తి చనిపోయినట్లు చెప్పారు. ఇప్పుడు.. నేరుగా జగన్ వాహనం కిందనే పడ్డట్లు కేసు నమోదు చేశారు. ఈ వీడియో నిజం అయితే పోలీసులు ముందుగా వేరేలా ఎందుకు చెప్పారు…? ఇది ఫ్యాబ్రికేటేడా అన్న అనుమానాలు YCP వ్యక్తం చేస్తోంది. పోలీసులు ముందుగా తప్పు చేశారు అంటోంది.. ఒక వేళ పోలీసులు నిర్థారించుకోకపోవడం తప్పైనా… తెలిసీ ఆ విషయాన్ని YSRCP దాచిపెట్టడం తప్పున్నర అనే వాదన ఉంది. ఈ విషయంలో వైసీపీ చేసింది ఇంకా పెద్ద తప్పు అని ప్రభుత్వం టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ డిబేట్ కు దారితీసిన పరిస్థితులేంటో ఓ సారి డీకోడ్ చేద్దాం..ఈనెల 18వ తేదీన వైఎస్ జగన్ మోహనరెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో చనిపోయిన తమ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లారు. భారీగా వాహనాలతో … జనాలతో వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కాన్వాయ్లో మూడు వాహనాలకు.. 100 మంది వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ పర్యటనకు భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో ఏటుకూరు బైపాస్లో రోడ్డులో జగన్ కాన్వాయ్ వెళుతుండగా.. భారీగా తోపులాట జరిగి వాహనం కింద పడి ఒకరు.. తొక్కిసలాటలో మరో చోట మరో వ్యక్తి చనిపోయారు. కాన్వాయ్లో ప్రైవేట్ వాహనం తగిలి వ్యక్తి చనిపోయారని గుంటూరు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఆ కార్యక్రమంలో రప్పా రప్పా ప్లకార్డులు.. వాటిపై కేసులు , నరుకుతాం.. అనే ప్లకార్డులకు ఆ తర్వాత రోజు “అయితే తప్పేంటి” జగన్ మోహనరెడ్డి సమర్థింపులు ఇవన్నీ పాత విషయాలే.. ఇప్పుడు కొత్త సంగతేంటంటే.. ఆ రోజు కార్యకర్త చనిపోయింది ప్రైవేట్ వెహికిల్ కింద పడి కాదు.. జగన్ కారు కిందనే అని..!
వీడియో-1: . జగన్ పర్యటనలో చనిపోయిన ఇద్దరిలో ఒకరు కాన్వాయ్లో వాహనం తగిలి చనిపోయారని పోలీసులు చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ మోహనరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కిందనే ఆ వ్యక్తి పడిపోయినట్లుగా ఓ వీడియో బయటకు వచ్చింది. దీని ఆధారంగానే ఈ కేసులో జగన్ వాహనాన్ని నడిపిన డ్రైవర్ ను A1, జగన్ ను A2, వాహనం కొన్న ఆయన OSD,జగన్ PA, పల్నాడు పర్యటనకు ఇన్ చార్జులుగా ఉన్న పేర్నినాని, విడుదల రజినీపై కేసులు నమోదయ్యాయి.
జగన్ ఓవైపు జనాలకు అభివాదం చేసుకుంటూ.. వెళ్తున్నారు. వాహనం నెమ్మదిగా మూవ్ అవుతోంది. బ్యానెట్పై మరో వ్యక్తి ఉన్నారు. జనాలు విపరీతంగా ఉండటంతో వాహనం కింద ఎవరైన పడే విషయం గుర్తించే పరిస్థితి లేదు.
సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఈ వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది. జగన్ వాహనం కింద మనిషి పడితే.. కాన్వాయ్లో ఇతర వాహనం అని ఎందుకు చెప్పారు.
జగన్ పర్యటనలో రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఎందుకు లేరు. వాహనం కింద మనిషి పడితే దానిని ఎెందుకు సరిగ్గా రిపోర్టు చేయలేదు.
వాహనం కింద మనిషి పడితే అందులో ప్రయాణించే వ్యక్తులపై కేసు పెడతారా.. డ్రైవర్ పైన పెడతారా..
ఆ వీడియో కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఎందుకుంది.. దానికి ముందూ వెనుకా ఎందుకు లేదు.. ఇది AI జనరేటేడ్ వీడియో ఎందుకు కాదు.. ? వైఎస్సార్సీపీ సంధిస్తున్న ప్రశ్నలు... ఈ వీడియోలో జగన్ మోహనరెడ్డి వాహనం కింద మనిషి పడటానికి ముందు.. కొంతమంది వ్యక్తులు గట్టిగా అరుస్తూ.. డ్రైవర్ను హెచ్చరిస్తున్న విజువల్స్ ఉన్నాయి. అప్పటికే వాహనం సింగయ్య పైకి ఎక్కి ఉండొచ్చు.. దానిని వెనక్కు వెళ్లమని చెబుతున్న విజువల్స్ ఉన్నాయి.
యాక్సిడెంట్ జరిగే సమయంలో వారికి తెలియక పోయినా.. జరిగిన తర్వాత కచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది,.
అలా ఓ వ్యక్తి వాహనం కింద పడిపోతే.. నిర్లక్ష్యంగా వదిలి ఎలా వెళ్లారు. కాన్వాయ్లోని వాహనం ద్వారా ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్ల లేదు.
తమ వాహనం కింద పడి వ్యక్తి చనిపోతే బాధ్యతాయుతమైన వ్యక్తులుగా అది తమ వెహికిల్ అన్న విషయాన్ని పోలీసులకు ఎందుకు చెప్పలేదు
జగన్ ర్యాలీకి అనుమతి లేదు.. అలాంటప్పుడు.. ఆయన వాహనానికి రక్షణగా పోలీసులను ఎందుకు ఏర్పాటు చేస్తారు.. పైగా గుంటూరు దగ్గర నుంచి సత్తెనపల్లి వరకూ 50 కిలోమీటర్లు రోప్ పార్టీ ఏర్పాటు ఎందుకు చేస్తారు.. ? అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు.. ఆయనకు ఆ ప్రోటోకాల్ కూడా లేదు
ఇదీ టీడీపీ అనుకూలంగా ఉండేవారు.. జగన్ చేసింది తప్పు అని వాదించే వాళ్లు చేస్తున్న వాదనలు.మొత్తం మీద చూస్తే.. ఈ పర్యటనలో ప్రమాదం అన్నది అనుకోకుండానే జరిగింది. బహుశా ఆ విషయాన్ని ఆ సమాయనికి జగన్ గుర్తించేందుకు అవకాశం లేదు. కానీ.. వాహనం కింద నుంచి మనిషిని తీసినప్పుడు... కనీసం డ్రైవర్కు .. అతని ద్వారా ఆయనకు తెలిసే అవకాశం ఉంది. అప్పటికప్పుడు కాకపోయినా.. ఆ రోజు సాయంత్రానికైనా తెలిసే అవకాశం ఉంది. ఇది తెలిసి కూడా పోలీసులకు తమ వాహన ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడని ఎందుకు చెప్పలేదు అన్నది అసలైన ప్రశ్న.ఈ ప్రమాదం జరిగిన రోజు.. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ కాన్వాయ్లోని ఓ ప్రైవేట్ వెహికిల్ తగిలి వ్యక్తి చనిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని సరిగ్గా నిర్థారించుకోవడంలో వారు పూర్తిగా ఫెయిల్. అలాగే పబ్లిక్ గా జరిగిన ఓ ప్రమాదంలో అసలు నిజం ఏంటన్నది 5రోజుల వరకూ చెప్పలేకపోవడం ప్రభుత్వం ఫెయిల్యూర్.. ఇంటెలెజెన్స్ ఈ విషయంపై అదే రోజు నివేదిక ఇచ్చిందో లెదో తెలీదు.. ఇవ్వకపోతే వాళ్లుకూడా ఫెయిల్యూర్ అనాలి. విషయాన్ని సరిగ్గా ముందే గుర్తించకపోవడంలో పోలీసుల తప్పు ఉందన్నది నిజమే.. కానీ దానిని తమకు అనుకూలంగా వైఎస్సార్సీపీ వాడుకోలేదా అన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే వారిపై కేసులు నమోదయ్యాయి. ఉద్దేశ్య పూర్వకంగా ఓ యాక్సిడెంట్ కేసును దాచిపెట్టారన్న దానిపైనే కేసులు నమోదు చేశారు.అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత ముందుగా నమోదు చేసిన కేసులో సెక్షన్లు మార్చారు. మొదట భారత న్యాయ సంహిత BNS 106 (1) కింద నమోదు చేసిన కేసును BNS 105 గా మార్చారు. BNS 105, 49కింద కేసు నమోదు చేశారు. దీనిని కల్బబుల్ హోమిసైడ్ Culpable Homicide అంటే ఓ వ్యక్తి మరణానికి కారణం అవ్వడం.. మర్డర్ చేయాలన్న తలంపుతో కాదు కానీ.. ఓ వ్యక్తి మరణానికి తెలిసి కూడా కారణమవ్వడం కింద పరిగణిస్తారు. సెక్షన్ 49 అనేది ఓ వ్యక్తి నేరపూరిత చర్య చేయడానికి తెలిసీ సహకరించడం కింద పరిగణిస్తారు. నేరంతో నేరుగా సంబంధం లేకున్నా.. నేరం చేయడానికి సహకరించారని.. నేరం చేసిన వ్యక్తికి అర్హమైన శిక్షనే వీళ్లకూ వర్తింపచేయాలని ఈ సెక్షన్ చెబుతుంది.ఇక రాజకీయంగా టీడీపీ అయితే తన వాహనం కింద పడి మనిషి చనిపోయిన విషయం బయట వాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆ వాహనాన్ని నడిపిన డ్రైవర్కు తెలుస్తుంది కదా.. తెలిసీ అదే రీతిలో యాత్ర ఎలా సాగించారు. కనీసం ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు... ? అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జగన్ వాహనం డ్రైవర్ ఎందుకు తన వాహనాన్ని పోలీసులకు సరెండర్ చేసి లొంగిపోలేదు.. ? పోలీసులు పొరపాటున మరో వాహనం పేరు చెప్పినా సరే.. బాధ్యతాయుతంగా వ్యవహరించి లొంగిపోవాలి కదా.. అని ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజు జగన్ కు కూడా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.. కానీ ఈ ఐదు రోజుల్లో కచ్చితంగా ప్రమాదం జరిగింది తన వాహనం ద్వారానే అని తెలిస్తుంది. తెలిసీ ఎందుకు దాచారు అన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు దానికి వైసీపీ సమాధానం ఇవ్వలేకపోతోంది.