
గుంటూరు, జూన్ 26,
జగన్ పర్యటనలో ఇద్దరు కాదు ముగ్గురు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల కిందట పల్నాడు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఓ వైసిపి నేత విగ్రహ ఆవిష్కరణకు గాను ఆయన పోలీస్ ఆంక్షలు నడుమ తాడేపల్లి నుంచి బయలుదేరారు. కానీ భారీ కాన్వాయ్ తో పాటు భారీ జన సమీకరణ నడుమ జగన్ పర్యటన సాగింది. ఈ క్రమంలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. మరో వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకొని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా మూడో మృతి వెలుగులోకి వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన యువకుడిని ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ గంటసేపు జగన్ పర్యటనలో ఆగిపోవడంతో అతను చనిపోయాడు.తాజాగా ఆ యువకుడి తండ్రి విలపిస్తూ చెప్పిన మాటలు ఓ వీడియోలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ర్యాలీ సమయంలో అంబులెన్స్ కు దారి ఇచ్చి ఉంటే తమ కుమారుడి ప్రాణాలు దక్కేవని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముప్పాళ్ళకు చెందిన మధు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో గుంటూరు తరలిస్తున్న సమయంలో జగన్ పర్యటనలో చిక్కుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దాదాపు గంటసేపు అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుంది. తరువాతే మధును గుంటూరుకు తరలించారు.ఈనెల 19న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. అయితే సకాలంలో ఆసుపత్రిలో చేర్పించకపోవడం వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ సత్తెనపల్లి ర్యాలీలో పాల్గొన్న జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. మరోవైపు సింగయ్య సైతం జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మధు సైతం జగన్ కాన్వాయ్ వల్లే చనిపోయాడని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. కాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ముగ్గురు ప్రాణాలను బలిగొన్నారని జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వరుసవివాదాలు
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీసీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇటీవలి పల్నాడు పర్యటనపై వివాదం కొనసాగుతోంది. మొదట పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో ఓ యువకుడు రప్ప.. రప్ప నరుకుతా అని ప్లకార్డు ప్రదర్శించాడు. దానిపై అధికార, విపక్ష పార్టీల మధ్య రచ్చ జరుగుతుండగానే ఓ వృద్దుడు కాన్వాయ్ కారుకింద పడి మరణించడం.. తర్వాత వృద్ధుడు పడింది జగన్ కారే అని వీడియోలు బయటకు రావడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి జగన్పై ఏపీ పోలీసులు ఏ2గా పేర్కొనడం రాజకీయ, న్యాయ చర్చలకు దారితీసింది.జగన్ కాన్వాయ్ కింద వృద్ధుడు పడి మరణించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్పై ఆరోపణలు రావడం జరిగింది. న్యాయపరంగా, ఒక నాయకుడు తన కాన్వాయ్లోని వాహనాల చర్యలకు ఎంతవరకు బాధ్యత వహించాలి? ఈ సంఘటనలో జగన్ను నిందితుడిగా పేర్కొనడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలు నీతి, నిర్లక్ష్యం, మరియు బాధ్యతల సమస్యలను లేవనెత్తుతున్నాయి. న్యాయస్థానం ఈ కేసును ఎలా విచారిస్తుందనేది భవిష్యత్తులో రాజకీయ నాయకుల బాధ్యతను నిర్ణయించే కీలక అంశంగా మారవచ్చు.ఈ ప్రమాదంలో భిన్న కోణాలు ఉన్నాయి. కారు నడిపింది ప్రభుత్వ డ్రైవర్ కాబట్టి అతనిపై కేసు పెట్టాలి కానీ, జగన్పై కేసు ఎలా పెడతారనివైసీపీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, జగన్ టూర్కు ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. అయితే ఆంక్షలు విధించినప్పుడు వాటిని పాటించకుండా.. అతిక్రమించడమే కాకుండా ప్రమాదానికి కారణం కావడం నేరమే కదా అని అధికార కూటమి నేతలు పేర్కొంటున్నారు. ఇక రోప్ పార్టీ విషయానికి వస్తే.. జగన్ ఎక్కడ పడితే అక్కడ ఆగడం, పర్యటన షెడ్యూల్లో లేకపోవడం కూడా రోప్ పార్టీ పోలీసులకు ఇబ్బందిగా మారింది.ఇక వైపీపీ నేతలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దెందలూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. కానీ, పోలీసులు నాడు టీడీపీ నేతలపై కేసు పెట్టారు. చంద్రబాబుపై కాదు. ఇదే అంశం ప్రస్తావిస్తున్నారు. అయితే ఘటన స్థలంలో చంద్రబాబు ఉన్నా.. ప్రత్యక్షంగా ఆయన కారణం కాలేదు. కానీ, ఇక్కడ జగన్ కారులో ఉండడం, ఆంక్షలు పాటించకపోవడంతో పోలీసులు కేసు పెట్టారు.
రాజకీయ నాయకుల బాధ్యతలు..
రాజకీయ నాయకులు తమ పర్యటనల సమయంలో భద్రతా ఏర్పాట్లను ఎంతవరకు పర్యవేక్షించాలి? కాన్వాయ్లోని డ్రైవర్లు, భద్రతా సిబ్బంది చర్యలకు నాయకుడు బాధ్యత వహించాలా? ఈ ఘటన రాజకీయ కార్యకలాపాల సమయంలో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలను పరిశీలిస్తే, నాయకులపై నేరపరమైన ఆరోపణలు చేయడం అరుదైనప్పటికీ, ఈ కేసు ఒక కొత్త దృష్టాంతాన్ని సృష్టించవచ్చు.ఈ ఘటన రాజకీయంగా వైఎస్సార్సీపీ, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందా? ప్రజల దృష్టిలో ఈ ఘటన నాయకుల బాధ్యతాయుతమైన ప్రవర్తనపై కొత్త చర్చను రేకెత్తిస్తుంది. సోషల్ మీడియా వేదికలలో ఈ ఘటనపై వస్తున్న స్పందనలు రాజకీయ నాయకులు తమ కార్యకలాపాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.ఈ ఘటన రాజకీయ నాయకులు తమ కాన్వాయ్లు, భద్రతా ఏర్పాట్లపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. న్యాయపరమైన దృక్కోణంలో ఈ కేసు నాయకుల జవాబుదారీతనం గురించి కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అదే సమయంలో, రాజకీయంగా ఈ ఘటన వైసీపీ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.