YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కమలంలో కాళేశ్వరం లొల్లి...

 కమలంలో కాళేశ్వరం లొల్లి...

కరీంనగర్, జూన్ 27, 
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు "ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు"గా, దీని రూపకల్పన, అమలు ఒక ఇంజినీరింగ్ అద్భుతమని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ, ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని, ప్రాజెక్టు నిర్మాణం అంతా లోపభూయిష్టంగా అభివర్ణిస్తున్నాయి. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు ఆ పార్టీనే గందరగోళంలోకి నెడుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై నేతల మాటల వల్ల అసలు ఈ ప్రాజెక్టుపై పార్టీ స్టాండ్ ఏంటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరంకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న చర్చ కమలం పార్టీలో నడుస్తోంది. అయితే, ఈ గందరగోళానికి తెరదించేందుకు కమలం పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఈ గందరగోళానికి కారణం ఏంటి, ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్‌కు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో ఈ కథనం పూర్తిగా చదివితే అర్థం అవుతుంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించింది. బీఆర్ఎస్ హయాంలో తొలి ఆర్థిక మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఈటల రాజేందర్ ఈ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన నాటి నుండి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు అటు పార్టీలోనూ, తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన పూర్తిగా తప్పుబట్టకుండా కొన్ని అంశాలనే వ్యతిరేకిస్తూ మాట్లాడటం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఆయన గులాబీ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ అనుభవంతో ఈటల ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే కానీ, నిర్మాణపరంగా లోపాలు జరిగాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తప్పు పట్టేది కాదని, గోదావరి నీళ్లను తెలంగాణకు మళ్లించడం మంచిదని చెప్పారు.అయితే, నిర్మాణం మాత్రం లోపభూయిష్టంగా జరిగిందని, అవినీతి చోటుచేసుకుందని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కొన్ని పంపుహౌస్‌లు నీట మునిగాయని, ఇది సాంకేతిక లోపంగా ఈటల అభివర్ణించారు. అయితే, ప్రాజెక్టుపై ఆయనకు ఉన్న అవగాహన, రైతుల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారని ఈటల మద్దతుదారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని వ్యతిరేకిస్తే రైతుల వ్యతిరేకంగా తన వ్యాఖ్యలు మారే అవకాశం ఉందన్న ఆలోచనతో ఆయన జాగ్రత్తగా కాళేశ్వరంపై స్పందించారని చెబుతున్నారు.కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సహా ఇతర కీలక నేతలు మాత్రం తప్పుబడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం గా మారిందని, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బండి సంజయ్ విమర్శిస్తున్నారు. ఇదో మోసపూరిత ప్రాజెక్టు అని, అడుగంటిన ప్రాజెక్టు కాళేశ్వరం అని, దీనికి నికర జలాలు లేవని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు ఉన్న కారణంగానే ప్రాజెక్టుకు సంబంధించిన పంపుహౌస్‌లు మునిగిపోయాయని బండి సంజయ్ చెప్పారు.ఈ అక్రమాలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాపంగా ఆయన అభివర్ణించారు. ఇదే రీతిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వంటి కీలక నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ అవినీతికి, పాలనా తీరుకు ఈ ప్రాజెక్టును చూపించే లక్ష్యంతో పనిచేస్తున్నారు.గత ప్రభుత్వంలో పని చేసిన సీనియర్ లీడర్ ఈటల రాజేందర్, ప్రస్తుతం బీజేపీలో కీలక నేత. ఈటల చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదే కానీ, నిర్మాణ లోపాలు, అవినీతి జరిగిందని చెప్పాలా, లేక ప్రాజెక్టు డిజైన్, రూపకల్పన అంతా తప్పని బండి సంజయ్ చెప్పిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలా అని కమలం నేతలు తలలు పట్టుకుంటున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్టీ స్టాండ్ ఏంటన్న చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. బీజేపీలో ఉంటే బీజేపీ స్టాండ్ మాట్లాడాలి తప్ప, వ్యక్తిగతం అంటూ ఏం ఉండదని బండి సంజయ్ నర్మగర్భంగా ఈటలను టార్గెట్ చేస్తూ మాట్లాడారన్న చర్చ పార్టీలో సాగుతోంది.తాము కేంద్ర మంత్రులు అయినా, పార్టీ అధ్యక్షులైనా తమ స్టాండ్ ఏదీ మారదని, కాళేశ్వరంపై మోదీ చెప్పిన స్టాండే తమదని బండి చెప్పడం ఈటల వ్యాఖ్యలను ఖండించడమేనని చెబుతున్నారు. అయితే, దీనిపై ఈటల నేరుగా స్పందించకపోయినా ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే అయినా, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, అవినీతి జరిగిందని తన వైఖరిని సమర్థించుకున్నారుఅయితే, ఈటల, బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీలో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే, బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి నేతలు డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈటల వ్యాఖ్యలు చేసిన వెంటనే బండి సంజయ్ పార్టీ స్టాండ్ ఇదేనంటూ చెబుతూ, ప్రధాని మోదీ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎం గా మారిందన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. మోదీ చెప్పిన మాటే పార్టీ లైన్ అని గందరగోళానికి తెరవేసే ప్రయత్నం చేశారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేరుగా స్పందించకపోయినా కాళేశ్వరం రాష్ట్రానికి నష్టం జరిగిందని పలు సందర్భాల్లో పార్టీ వైఖరిని వెల్లడించారు. పార్టీలో ఒకే స్వరం ఉండాలన్న ఉద్దేశంతో బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించినట్లు కమలం నేతలు చెబుతున్నారు.కమలం నేతల భిన్న వైఖరులు ఇదే రీతిలో చాలా విషయాల్లో బయటపడింది. దీంతో అటు పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజల్లో కూడా బీజేపీ స్టాండ్ ఏంటన్న చర్చకు దారితీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, పార్టీ నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా, పార్టీ నిర్ణయాల మేరకే మాట్లాడాలన్న సంకేతాలను అధిష్టానం త్వరలోనే గట్టిగా పంపే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

Related Posts