
హైదరాబాద్, జూన్ 27,
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అందులో జగన్ తల్లి విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే జగన్ మెడకు మరో ఉచ్చు చిక్కుకోవడం ఖాయమని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తొలుత తెలంగాణకే పరిమితమైన ఈ ట్యాపింగ్ ఇష్యూ.. ఇప్పుడు ఏపీనీ తాకింది. రాజకీయ నేతలతోపాటు వ్యాపారవేత్తలు, జడ్జిలు, సినీ ప్రముఖులు, మీడియా (యజమానులు, జర్నలిస్టుల) ఫోన్లు ట్యాపింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ పేరు బలంగా వినిపించింది. ఆమె ఫోన్ ట్యాప్ అయినట్టు అధికారులు గుర్తించారు. వైఎస్ షర్మిల ఫోన్తోపాటు విజయమ్మ ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు దాదాపుగా ధృవీకరించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారట అప్పటి అధికారులు. కేవలం దర్యాప్తు అధికారుల వద్ద కేవలం 2023 ఏడాది నవంబర్ నెలకు సంబంధించిన ఆధారాలు మాత్రమే ఉన్నాయి. ఆ జాబితాలో దాదాపు 650 మంది ప్రముఖులు ఉన్నారు. హైకోర్టుకి చెందిన నలుగురు జడ్జీలతోపాటు రాజకీయ నేతలు ఉన్నారు. అధికారుల వద్దనున్న సమాచారం ఆధారంగా వారిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన వారిని సాక్షులుగా మాత్రమే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు సిట్ టీమ్కు సహకరించలేదని తెలుస్తోంది. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఎస్ఐబీ టీమ్ .. ఓ నివేదికను రివ్యూ కమిటీకి పంపిందట. ఆ కమిటీ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అధికారుల విచారణలో తేలింది. అందులో భాగంగానే సాక్షుల స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ట్యాపింగ్ సమయంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అందులో భాగంగానే టీడీపీ కీలక నేతలు, షర్మిల, విజయమ్మ ఫోన్లు సైతం ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. షర్మిల, విజయమ్మ ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలను వైసీపీ కీలక నేత ద్వారా ఏపీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం వెళ్లినట్టు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో ఏపీకి చెందిన నేతల స్టేట్మెంట్లను రికార్డు చేయాలని భావిస్తోందట సిట్. షర్మిల ఫోన్ దాదాపు 45 రోజులు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. జగన్-షర్మిలకు గ్యాప్ సమయంలో కూతురు వైపు విజయమ్మ మొగ్గుచూపారు. మొత్తానికి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లో జగన్ కూడా ఇరుక్కుపోయినట్టు కనిపిస్తున్నారు. రేపటి రోజున ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.