
మహబూబ్ నగర్, జూన్ 27,
తెలంగాణలో బనకచర్లపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్కు చేరుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తోంది.ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది. చర్చల అంశాన్ని చూపించి కాంగ్రెస్ని ఇరుకునపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఏపీతో చర్చలు జరపడం సరికాదని.. ముందు అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేస్తోంది.
అయితే ఈ అంశంలో బీఆర్ఎస్ను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ కూడా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు మీద అసెంబ్లీలో చర్చకు సిద్ధమా కేసీఆర్..? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు.మరోవైపు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. దీనిపై కేంద్ర జలశక్తి మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని.. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 30న బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్న ఉత్తమ్.. గతంలో బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్కు ఎలా సహకరించిందో వివరిస్తామన్నారు. గతంలో ప్రగతిభవన్ వేదికగా ప్రాజెక్టు డిజైన్ అయిందన్నారు.ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ రెండూ బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో రాజకీయంగా ఎత్తుకుపైఎత్తు వేస్తుండటంతో.. రాబోయే రోజుల్లో ఇది అంశంపై మరింత రగడ ఖాయమనే చర్చ జరుగుతోంది.జల వివాదాలపై ఏపీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటటున్నారు. గొడవలు పెట్టుకోవడం కాదు.. చర్చలే తమకు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తానే ఆహ్వానిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్క రోజు కాదు.. అవసరమైతే 4 రోజులైనా కూర్చొని చర్చించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోనంటున్నారు. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు. అలాగని ఎవరి కోసమో తమ హక్కులను వదులుకునేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.బనకచర్లపై కేంద్రాన్ని సంప్రదించక ముందే తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే ఈ వివాదం ఉండేదే కాదన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరి బీఆర్ఎస్కు ఆయుధంగా మారిందన్నారు. చర్చల ద్వారానే నీటి వివాదాల పరిష్కారమవుతాయన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రుల స్థాయిలో చాలా అంశాలపై చర్చించామన్నారు. నీళ్ల పంచాయితీపై జూలై 6, 7 తేదీల్లో మళ్లీ ఢిల్లీకి వెళ్తానని రేవంత్ అన్నారు.ఇక బీఆర్ఎస్పైనా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలుపు కోసం గోదావరి నీటిపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. అధికారం పోయిన అసహనంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు పండుతున్న పంటలకు కాళేశ్వరానికి సంబంధం లేదన్నారు. తెలంగాణకు కేసీఆర్, హరీష్రావు అన్యాయం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం పూర్తి కావాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలన్నారు రేవంత్. ఇప్పటి వరకు రూ.98వేల 902 కోట్ల బిల్లులు చెల్లించాంమని.. ఇంకా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు.