
వరంగల్, జూన్ 26,
స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నిర్వహిస్తామని అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక బీసీలకు రిజర్వేషన్లు కూడా కేటాయిస్తామని వెల్లడించింది. బిసీల రిజర్వేషన్ల విషయంలో అనేక న్యాయపరమైన సమస్యలో ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇటీవల బీసీల రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభలో ప్రభుత్వం ఒక తీర్మానాన్ని రూపొందించి కేంద్రానికి పంపించింది. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. కేంద్రం ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి పరిధిలోకి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఆ బిల్లుకు మోక్షం లభిస్తుంది. అయితే బీసీలు కేవలం తెలంగాణలో మాత్రమే లేరు కాబట్టి.. పైగా రిజర్వేషన్ల అంశం అనేది కేంద్ర పరిధిలోది కాబట్టి.. దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం ఆశించినత స్థాయిలో ఆసక్తి చూపించకపోవడంతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి అనేక పిటిషన్లు వెళ్లాయి. ఆ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వార్డుల విభజన ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పందించారు. ప్రభుత్వం తరఫున ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని కోరారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు 60 రోజుల గడువు కావాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసిన సర్వోన్నత న్యాయస్థానం సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను సెప్టెంబర్ లోపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.వార్డుల విభజన, ఓటర్ జాబితాలో మార్పులు , చేర్పులు.. కొత్త ఓటర్లు నమోదు.. రిజర్వేషన్లు.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.. ఇక తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలు సాధించినప్పటికీ.. అధికార పార్టీకి ఆ ఫలితాలు అంతగా ఆనందాన్ని ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర పరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో జడ్పీ చైర్మన్, ఇతర స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కూడా అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తామని చెబుతున్నాయి.